Ghulam Nabi Azad: గులామ్ నబీ ఆజాద్ ‘DNA మోదీ-ఫైడ్’.. షాకింగ్ కామెంట్స్ చేసిన జైరామ్ రమేష్..
Ghulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో పదవులు చేపట్టిన గులామ్ నబీ ఆజాద్.. నేడు పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Ghulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో పదవులు చేపట్టిన గులామ్ నబీ ఆజాద్.. నేడు పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతోంది. అదే సమయంలో ఆజాద్ రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేయడం ఆ పార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన గులామ్ నబీ ఆజాద్.. నేడు తన స్వార్థం కోసం పార్టీని వీడుతూ విమర్శలు చేయడంపై నిప్పులు చెరుగుతున్నారు పార్టీ సీనియర్ నేతలు. గులామ్ నబీ ఆజాద్ రాజీనామాపై తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్ అయ్యారు. ఏకంగా ఆయన DNAకు మోదీ-ఫైడ్ చేసుకున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీని కాదని, తన DNAకు మోదీ-ఫైడ్ చేసుకుని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
పార్టీ నాయకత్వంపై చేసిన విమర్శలు చేయడంపైనా ఫైర్ అయ్యారు జైరామ్ రమేష్. రాజ్యసభ పదవీకాలం ముగియగానే గులామ్ నబీ ఆజద్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని, అతని ‘DNA మోదీ-ఫైడ్’ అని సంచలన కామెంట్స్ చేశారు. గులామ్ నబీ ఆజాద్ను కాంగ్రెస్ నాయకత్వం అత్యంత గౌరవప్రదంగా చూసుకుందని, వ్యక్తిగత అవసరాల కోసం ఇప్పుడు దారుణంగా మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఈ మేరకు జైరామ్ రమేష్ ఒక ట్వీట్ చేశారు.
ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా తీవ్రంగా స్పందించారు. ఆజాద్ విమర్శలపై భగ్గుమన్నారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతోనే.. అతని మనసులోని దుర్భుద్ధి బయటపడిందన్నారు. పదవి లేకుండా ఉండలేకపోతున్నారని, ఆ కారణంగనే అసత్య ఆరోపణలు చేస్తూ, కన్నతల్లి లాంటి పార్టీని వీడి మోసం చేశారని ఫైర్ అయ్యారు.
ఇదిలాఉంటే.. జమ్మూ, కశ్మీర్ సంస్థాగత ఎన్నికలకు ముందు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు గులామ్ నబీ ఆజాద్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఆజాద్. 2013లో రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని సమూలంగా నాశనం చేశారని విమర్శించారు. సోనియా గాంధీ కేవలం ఉత్సవ విగ్రహంగా మిగిలారని, రాహుల్ గాంధీ ఆయన కోటరీ మాత్రమే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు ఆజాద్. రాహుల్ గాంధీ పిల్లచేష్టలు, అనుభవలేమి కాంగ్రెస్ పతనానికి కారణమని అన్నారు. G23 పేరుతో పార్టీని కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండాపోయిందన్నారు.
ఇక, 1973లో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆజాద్, తొమ్మిదిసార్లు AICC ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 18 ఏళ్ల పాటు సభ్యుడిగా ఉన్నారు. క్రైసిస్ మేనేజర్గా కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి పేరుంది. అయితే కొంతకాలంగా ఆయన బీజేపీకి దగ్గరయ్యారన్న విమర్శలున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి అంటూ విసృతంగా చర్చ సాగింది. అయితే త్వరలో జరిగే కశ్మీర్ ఎన్నికల్లో ఆజాద్ను బీజేపీ ఏదోరూపంలో ఉపయోగించుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అంటోంది.
A man who has been treated by the greatest respect by the Congress leadership has betrayed it by his vicious personal attacks which reveals his true character. GNA’s DNA has been modi-fied.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 26, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..