Rahul Gandhi: ఢిల్లీ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం.. రాహుల్‎కు కీలక బాధ్యతలు..

|

Jun 08, 2024 | 7:00 AM

కొత్త లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక ఇక లాంఛనంగానే కనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కమిటీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశంలో జరుగుతుంది. ఈసమావేశంలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించే తీర్మానం చేయనున్నారు. అలాగే పలు రాజకీయాంశాలపై కూడా తీర్మానాలు చేస్తారని తెలుస్తోంది. సాయంత్రం ఢిల్లీలోని హోటల్ అశోకలో తలపెట్టిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యేందుకు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలు హస్తిన బాట పట్టారు.

Rahul Gandhi: ఢిల్లీ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం.. రాహుల్‎కు కీలక బాధ్యతలు..
Rahul Gandhi
Follow us on

కొత్త లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక ఇక లాంఛనంగానే కనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కమిటీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశంలో జరుగుతుంది. ఈసమావేశంలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించే తీర్మానం చేయనున్నారు. అలాగే పలు రాజకీయాంశాలపై కూడా తీర్మానాలు చేస్తారని తెలుస్తోంది. సాయంత్రం ఢిల్లీలోని హోటల్ అశోకలో తలపెట్టిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యేందుకు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలు హస్తిన బాట పట్టారు. సమావేశానికి కొత్తగా ఎంపికైన ఎంపీలతో పాటు రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్న అనంతరం కొత్త ఎంపికైన సభ్యులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించి, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభ వెలుపల చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా వారికి వివరించే అవకాశం ఉంది. అలాగే కొత్త సభ్యులకు పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.

ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ విందులో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కి ప్రతిపక్ష నేత హోదా పొందే అవకాశం ఏర్పడింది. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు సాంకేతికంగా ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు సరిపోలేదు. అందుకే ఈ పదేళ్లలో అటు సోనియా గాంధీ, ఇటు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత పదవిని తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్ష నేతగా మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి వ్యవహరించారు. ఇప్పుడు 10 శాతానికి మించి సీట్లను కాంగ్రెస్ గెలుపొందింది. ప్రతిపక్ష నేత హోదా, ప్రొటోకాల్ అధికారికంగా పొందే అవకాశం దక్కడంతో.. ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని సభలోపల, సభ వెలుపల ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎత్తిచూపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటుంది. మోదీకి ధీటైన ప్రత్యామ్నాయ నేతగా రాహుల్ గాంధీ తన ప్రతిష్టను పెంచుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..