సామాన్యుడి చేతిలోకి సరికొత్త అస్త్రం.. సైబర్ నేరాలకు చెక్ పెట్టే ఏఐ చాట్బాట్.. ఎలా వాడాలంటే?
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ల పేరిట సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సరికొత్త ఆస్త్రాన్ని తీసుకొచ్చింది. పౌరుల భద్రతే లక్ష్యంగా అభయ్ (ABHAY) పేరుతో ఒక సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ సిస్టమ్ను స్టార్ట్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పికప్పుడూ చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభయ్ అనే సరికోత్త ఏఐ ఆధారిత వెరిఫికేషన్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇది మీకు వచ్చిన సీబీఐ నోటీసు అసలైనదా? లేక కేటుగాళ్లు సృష్టించిన నకిలీదా? అనే విషయాన్ని ఇకపై కేవలం ఒక్క క్లిక్తో, నిమిషాల వ్యవధిలోనే కనిపెడుతుంది. దీన్ని ఇప్పుడు సామాన్య పౌరులు కూడా యాక్సెస్ చేయవచ్చు.
భారత చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు
ఈ సందర్భంగా సీబీఐ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. భారతీయ చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలిపింది. మిమ్మల్ని భయపెట్టి, కెమెరాల ముందు కూర్చోబెట్టి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామనే సైబర్ నేరగాళ్ల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపింది. నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
టెక్నాలజీతో బురిడీ కొట్టిస్తే.. టెక్నాలజీతోనే చెక్
డీప్ ఫేక్, ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ అధికారుల రూపాలను సృష్టించి ప్రజలను దోచుకుంటున్న ముఠాలపై గట్టి నిఘా ఉంచినట్లు సీబీఐ పేర్కొంది. అలాగే, సైబర్ నేరగాళ్లకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్న బ్యాంకింగ్, టెలికాం సంస్థలపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.టెక్నాలజీతో బురిడీ కొట్టించే వారికి అదే టెక్నాలజీతోనే చెక్ పెట్టాలని తెలిపింది.
అభయ్ పోర్టల్ను ఎలా ఉపయోగించాలి?
- ఒక వేళ ఎవరినుంచైనా మీకు నోటీసులు వస్తే వాటిని వెరిఫై చేసుకోవడానికి కింద పేర్కొన్న పద్ధతులను పాటించాలని ఏసీబీఐ అధికారులు చెబుతున్నారు.
- మొదటగా సీబీఐ అధికారిక వెబ్సైట్ www.cbi.gov.in లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే ‘ABHAY’ లోగోపై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్కు వచ్చే OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- ఇప్పుడు మీకు వచ్చిన నోటీసు కాపీని పీడీఎఫ్ లేదా చిత్రం (Image) అక్కడ అప్లోడ్ చేయాలి.
- మీ నోటీసును స్కాన్ చేసి, అది నిజమైనదా లేక నకిలీదా అనే విషయాన్ని ఈ AI చాట్బాట్ కేవలం నిమిషాల వ్యవధిలోనే తేల్చి చెబుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
