Bhagirathi River: నాడు ఆత్మలను శుద్ధి చేసే నదిగా పేరు.. నేడు నలుపు రంగుగా మారి, కలవరపెడుతోన్న భాగ్మతి..
భాగ్మతి నదిలో కాలుష్యం పెరగడంతో నేపాల్ ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నదిని శుభ్రం చేయడం పెద్ద సమస్యగా మారింది.
భారతీయులకు గంగానది ఎంత పవిత్రమో, నేపాలీలకు భాగ్మతి అంతే పవిత్రం. హిమాలయ పర్వతాల్లో ఓ పులి విగ్రహం నోటి నుంచి మొదలైన భాగ్మతి ప్రవాహం నదిగా మారి బీహార్లోని కమ్లానదిలో కలుస్తుంది. 586 కిలో మీటర్ల దూరం ప్రవహించే ఈ నదిని నేపాల్ హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. వారి మత పరమైన విధుల్లో భాగ్మతి కూడా ఒక భాగం. నాలుగు దశాబ్దాల కిందటి వరకూ భాగ్మతి నది ఎంతో స్వచ్ఛంగా ఉండేది. కానీ, ఇప్పుడా నది మురికీనీటి ప్రవాహంగా మారిపోయింది. భాగ్మతి నది ఒడ్డున నేపాల్ రాజధాని ఖాట్మండూతో పాటు పఠాన్ నగరాలు ఉన్నాయి. అప్పటి వరకూ బ్రౌన్ రంగులో ఉండే నది ఖాట్మండూ నుంచి నలుపురంగులోకి మారుతుంది. చెత్తా చెదారంతో పాటు డ్రైనేజీ నీరు ఇందులో చేరుతోంది.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన పశుపతినాథ్ ఆలయం భాగ్మతి ఒడ్డునే ఉంది. భక్తులు ఈ నదిలో పుణ్యస్నానాలు చేయడంతో పాటు మతపరమైన క్రతువులను ఆచరిస్తారు. ఆత్మలను శుద్ధి చేసే శక్తి భాగ్మతికి ఉందని విశ్వసిస్తారు. అందుకే మరణించిన వారికి అంత్యక్రియలను ఈ నది ఒడ్డున నిర్వహిస్తారు. భౌతిక కాయాలను భాగ్మతీ జలాలతో శుభ్రం చేస్తారు. కాగా, భాగ్మతి నదిలో కాలుష్యం పెరగడంతో మతపరమైన విధులను నిర్వహించడం ఇబ్బందిగా మారింది. చాలా మంది భక్తులు బాటిల్ వాటర్తోనే పని కానిచ్చేస్తున్నారు.
భాగ్మతి నదిలో కాలుష్యం పెరగడంతో నేపాల్ ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నదిని శుభ్రం చేయడం పెద్ద సమస్యగా మారింది. క్లీన్ భాగమతి క్యాంపేన్ ద్వారా చాలా వరకూ చెత్తా చెదారం తొలగిస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఏదైనా భారీ వరద వస్తే తప్ప భాగమతి పూర్తి స్థాయిలో శుద్ధి కాదని చెబుతున్నారు.