ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఈ దంపతులు తమ బిడ్డకు భలే పేరు పెట్టారు!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ విజయానికి సంబురాలు జరుగుతుండగా, బీహార్ లోని ఒక జంట తమ కుమార్తెకు 'సిందూరి' అని నామకరణం చేసింది.

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడితో యావత్ భారత దేశం కన్నీళ్లు పెట్టుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉగ్రదాడికి బదులుతీర్చకుంటూ.. ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని మట్టుబెడతామంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఆ తర్వాత మే 6-7 మధ్య భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత సైన్యం జరిపిన ఈ దాడులపై యావత్ దేశం సంతోషం వ్యక్తం చేసింది. అయితే.. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవ్వడంతో ఆ పేరు స్ఫూర్తితో ఓ జంట తమ శిశువుకు ‘సిందూరి’ అని పేరు పెట్టారు.
బీహార్లోని కతిహార్ జిల్లాలోని బాల్తి మహేశ్పూర్ గ్రామానికి చెందిన సంతోష్ మండల్, రాఖీ కుమారి దంపతులకు బుధవారం పండంటి ఆడపిల్ల జన్మించింది. అయితే అదే రోజు భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించి, పాక్పై ప్రతీకారం తీర్చుకోవడంతో దేశమంత సంబురాలు చేసుకున్నారు. ఉగ్రవాదులపై దాడి చేసిన భారత్ విజయం సాధించడం, అదే రోజు మాకు కుమార్తె జన్మించడం రెండూ మా కుటుంబానికి గర్వకారణం ఆ దంపతులు అన్నారు. అందుకే తమ దేశభక్తి చాటుకుంటూ తమ బిడ్డకు ఆపరేషన్ సిందూర్ పేరు మీద సిందూరి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ అనేది భారత దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్. ఇందులో బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం వంటి ముఖ్యమైన ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు జరిగాయి. పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు అమరులైన తర్వాత, ప్రతీకారం తీర్చుకునే సమయం, ప్రదేశం, విధానాన్ని సైనిక కమాండర్లు నిర్ణయించగలిగేలా ప్రధానమంత్రి నుండి పూర్తి అధికారంతో దీనిని చేపట్టారు. ఆపరేషన్ సిందూర్లో.. ‘సిందూర్’ అనే పేరు సాంప్రదాయకంగా వివాహితులైన హిందూ మహిళలు ధరించే సింబాలిక్ ఎర్రటి పొడి నుండి ప్రేరణ పొందింది. పహల్గామ్ విషాదంలో బాధితుల్లో కొందరు వివాహిత మహిళలు, దాడి సమయంలో నేవీ అధికారితో సహా తమ భర్తలను కోల్పోయినందున ఇది మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..