పెళ్లైన 36 రోజులకే.. సమోసాలో పురుగుల మందు కలిపి.. భర్తను హతమార్చిన కొత్త పెళ్లి కూతురు!
మేఘాలయ హనీమూన్ హత్యోదంతం మరువకముందే మరో మహిళ తన భర్తను హతమార్చింది. పెళ్లైన కేవలం 36 రోజులకే సమోసాలో పురుగులు మందు కలిపి భర్తకు తినిపించింది. అనంతరం కాసేపటికే భర్త తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్లో వెలులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాంచీ, జూన్ 16: జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో బహోకుదర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్తో సునీతే దేవి (22)కి గత నెల 11న వివాహం జరిగింది. అనంతరం లాంఛనాల ప్రకారం భర్తతోపాటు మెట్టింటికి వెళ్లనప్పటికీ.. తొలి రోజే ఆమె పుట్టింటికి తిరిగి వెళ్లిపోయింది. అతనితో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో ఇరువైపుల పెద్దలు చర్చించి ఆమెకు సర్దిచెప్పి జూన్ 5న కాపురానికి పంపారు. జూన్ 14న పెరట్లోని మొక్కల కోసం పురుగుల మందు అవసరమని భర్తను కోరింది. అంతే భార్య ప్రేమగా మాట్లాడిందన్న ఆనందంలో ఆగమేఘాల మీద వెళ్లి బుద్ధనాథ్ పరుగుల మందు కొని తెచ్చాడు.
ఆ మరుసటి రోజే అంటే జూన్ 15న భర్త కోసం స్పెషల్గా చికెన్ కర్రీ వండి.. సమోసాలతో వడ్డించింది. ఆనక పక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. అయితే భోజనం తర్వాత కాసేపటికే బుద్ధనాథ్ తీవ్ర అశ్వస్థతకు గురయ్యాడు. బంధువులు అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జూన్ 15న జరిగినప్పటికీ మృతుడి బంధువులు కొత్త కోడలిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో సునీత అత్తపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని, ఆ తర్వాత తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించినట్లు రాంకా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) రోహిత్ రంజన్ సింగ్ తెలిపారు.
తన మొదటి ప్రయత్నం విఫలమైతే, బ్యాకప్ ప్లాన్గా సునీత తన బ్లౌజ్లో మరో రెండు పురుగుమందుల ప్యాకెట్లను భద్రపరిచిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బుద్ధనాథ్ చనిపోయినట్లు నిర్ధారనైన తర్వాత ఆమె మిగిలిన ప్యాకెట్లను సమీపంలోని పొదల్లో పారవేసిందని తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఇతరుల ప్రమేయం కూడా ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








