1917లో బ్రిటన్కు రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు! ఇప్పుడు వడ్డీతో సహా తీర్చాలని..
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్కు చెందిన కుటుంబం రూ.35 వేల యుద్ధ రుణంగా ఇచ్చింది. 109 ఏళ్ల నాటి సర్టిఫికెట్ ఇప్పుడు కీలకంగా మారింది. ఆ సొమ్ము తిరిగి చెల్లించారా అని కుటుంబం ప్రశ్నిస్తోంది. తాజాగా బ్రిటన్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ పత్రాలు కోరడంతో ఆశలు పెరిగాయి.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.35 వేల రుణానికి సంబంధించిన పాత అగ్రిమెంట్ కాగితం.. మధ్యప్రదేశ్కు చెందిన ఓ కుటుంబంలో కొత్త ఆశలు రేకెత్తించింది. 1917లో ‘ఇండియన్ వార్ లోన్’లో పెట్టుబడి పెట్టిన తమ పూర్వీకుల సొమ్ము ఇప్పటికీ తిరిగి చెల్లించలేదని కుటుంబం చెబుతోంది. తాజాగా బ్రిటన్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ (DMO) నుంచి స్పందన రావడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
1917లో రూ.35 వేలు పెట్టుబడి
మధ్యప్రదేశ్లోని సెహోర్కు చెందిన 63 ఏళ్ల వివేక్ రుథియా కుటుంబం వద్ద 109 ఏళ్ల నాటి కీలక పత్రం ఉంది. 1917 జూన్ 4 తేదీతో ఉన్న ఈ సర్టిఫికెట్ ప్రకారం.. అప్పటి భోపాల్ సంస్థానంలోని సేథ్ రామ కిషన్ జస్కరణ్ రుథియా సంస్థకు చెందిన సేథ్ జుమ్మా లాల్ రుథియా.. మొదటి ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘ఇండియన్ వార్ లోన్’కు రూ.35,000 చెల్లించారు. అప్పటి భోపాల్ పొలిటికల్ ఏజెంట్ డబ్ల్యూ.ఎస్. డేవిస్ సంతకం చేసిన ధ్రువపత్రంలో ఈ మొత్తాన్ని భారత యుద్ధ రుణానికి చందాగా చెల్లించినట్లు పేర్కొన్నారు.
109 ఏళ్ల తర్వాత స్పందన
తమ పూర్వీకులు ఇచ్చిన ఈ మొత్తానికి సంబంధించి ఎప్పుడైనా తిరిగి చెల్లింపు జరిగిందా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు రుథియా కుటుంబం బ్రిటిష్ అధికారులను సంప్రదించింది. తాజాగా యూకే డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి రుథియా కుటుంబం తరఫు న్యాయవాదికి ఇమెయిల్ వచ్చింది. అందులో అసలు యుద్ధ రుణ ధ్రువపత్రంతో పాటు దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలను సమర్పించాలని కోరినట్లు కుటుంబం తెలిపింది. దీంతో అవసరమైన పత్రాలు, ఇతర చారిత్రక ఆధారాలను బ్రిటిష్ అధికారులకు పంపేందుకు కుటుంబం సిద్ధమవుతోంది.
డబ్బు నిజంగా తిరిగి చెల్లించారా?
సేథ్ జుమ్మా లాల్ రుథియా 1937లో మరణించారు. అయితే ఆయన కుటుంబానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ రుణం తిరిగి చెల్లించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రస్తుత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ మొత్తానికి సంబంధించిన పరిష్కార రికార్డులు తమకు కనిపించలేదని అంటున్నారు. అయితే రూ.35 వేల రుణం ఎప్పుడూ తిరిగి చెల్లించలేదన్న కుటుంబ వాదన స్వతంత్రంగా ధ్రువీకరించబడలేదు. తాజాగా బ్రిటిష్ DMO పత్రాలను కోరడం వల్ల ఈ వ్యవహారంపై అధికారిక రికార్డుల ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కుటుంబం భావిస్తోంది.
నేటి విలువ ఎంత ఉంటుంది?
1917లోని రూ.35,000ను నేటి విలువతో పోల్చితే భారీ మొత్తం అవుతుంది. చక్రవడ్డీ, అప్పటి-ఇప్పటి బంగారం ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దీని విలువ కోట్ల రూపాయలకు చేరవచ్చని కుటుంబం గతంలో పేర్కొంది. కొన్ని అంచనాల్లో రూ.10 కోట్లకు పైగా విలువ ఉండవచ్చని కూడా చెప్పింది. అయితే 109 ఏళ్ల నాటి రూ.35 వేల రుణం నేడు రూ.10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా చెల్లించాల్సిందేనని చెప్పలేం. అసలు క్లెయిమ్ చెల్లుబాటు కావాలంటే సర్టిఫికెట్లోని నిబంధనలు, వడ్డీ వర్తిస్తుందా లేదా, మెచ్యూరిటీ, రిడెంప్షన్ నిబంధనలు, గతంలో ఏదైనా చెల్లింపు జరిగిందా వంటి అంశాలను బ్రిటిష్ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు 109 ఏళ్ల నాటి ఆ పత్రం నిజంగా ఎంత విలువైనదో.. బ్రిటిష్ అధికారుల రికార్డులు ఏం చెబుతాయో ఆసక్తికరంగా మారింది.
