Lifestyle: కరకరలాడే మినపగారెలు.. ఇలా ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు
మినపగారెలు నూనె పీల్చుకోకుండా, హోటల్ స్టైల్లో క్రిస్పీగా, మెత్తగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. మినపప్పు నానబెట్టడం నుంచి పిండి తయారుచేసే విధానం, వడలు వేయించే పద్ధతులు, నూనె పీల్చుకోకుండా ఉండే చిట్కాలు స్పష్టంగా చూసేయండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హోటల్ స్టైల్లో క్రిస్పీగా, నూనె పీల్చుకోకుండా ఉండే పర్ఫెక్ట్ మినపగారెలను తయారు చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మొదటగా, ఒక కప్పు మినపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లన్నీ వంపేసి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పోస్తూ పిండి గట్టిగా, మెత్తటి పేస్ట్లా ఉండేలా చూసుకోవాలి. పిండి లూస్ అయితే వడలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత సుమారు ఐదు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచడం వల్ల పిండి గట్టిపడి, వడలు మంచి రంగులో, క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ పిండి లూస్ అనిపిస్తే ఒకటి లేదా రెండు స్పూన్ల బియ్యపిండిని కలుపుకోండి.
ఇది చదవండి: గ్యాస్ స్టవ్లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
తర్వాత పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరగా చిటికెడు వంట సోడా వేసి పిండిని బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల వడలు లోపల మెత్తగా, ఫ్లఫీగా వస్తాయి. సిద్ధమైన పిండిని కొద్దిగా నీళ్లలో వేసి చూస్తే అది పైకి తేలాలి, అప్పుడే పిండి వడలు వేయడానికి పర్ఫెక్ట్గా ఉందని అర్థం. వడలు వేసేటప్పుడు చేతిని నీటితో తడుపుకుని, కొంచెం పిండిని తీసుకుని రౌండ్ షేప్ చేసి మధ్యలో రంధ్రం పెట్టి వేడి నూనెలో వేయాలి. చేతితో వేయడం రానివారు ప్లాస్టిక్ కవర్ లేదా టీ ఫిల్టర్ని తడిపి దానిపై పిండిని పెట్టి నూనెలో వేయవచ్చు. వడలను ఎప్పుడూ మీడియం మంటపైనే వేయించుకోవాలి. అధిక మంటపై వేయిస్తే లోపల పచ్చిగా ఉంటాయి, తక్కువ మంటపై అయితే నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. రెండు వైపులా లేత బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి తీస్తే, వేడివేడి క్రిస్పీ గారెలు సిద్ధం. వీటిని కొబ్బరి లేదా కారం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..
