తెలంగాణ బోనాల స్పెషల్ మటన్ కర్రీ రెసిపీ.. ఇలా చేస్తే ముక్క మిగలదు..!
తెలంగాణ పండుగల విందుల్లో మటన్ కర్రీకున్న ప్లేస్ గురించి అందరికీ తెలుసు. బోనాల లాంటి శుభ సందర్భాల్లో ఇంట్లో ఘుమఘుమలాడే మసాలా మటన్ వండటం అనేది ఓ ట్రెడిషన్ లాంటిది. ఈ స్పెషల్ డేస్ లో రెగ్యులర్ గా కాకుండా ఇంకాస్త టేస్టీగా, అదిరిపోయేలా మటన్ కర్రీ తయారు చేసుకోవాలంటే.. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి.

తెలంగాణ పండుగలంటేనే బంధుమిత్రులతో సందడి, దావత్, మసాలా ఘుమఘుమలు. ఫంక్షన్ అనే మాట వినగానే మటన్ లేని దావత్ అసంపూర్తిగా అనిపిస్తుంది. ముఖ్యంగా బోనాల సమయంలో అయితే ప్రతి ఇంట్లోనూ మటన్ వండాల్సిందే. ఆ మటన్ మసాలా వాసన ఊరంతా పరచుకుంటుంది. మరి అలాంటి ఈ స్పెషల్ డేస్ లో మటన్ కర్రీని రోటీన్ గా కాకుండా ఇంకాస్త టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు
- మటన్ – 500 గ్రాములు
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర – ½ టీ స్పూన్
- పచ్చిమిర్చి – 2 (తరిగినవి)
- కరివేపాకు – ఒక రెబ్బ
- ఉల్లిపాయలు – 2 (మధ్య సైజు, తరిగినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర – చిన్న కట్ట
- పుదీనా – 10 ఆకులు
మసాలా కోసం కావాల్సిన పదార్థాలు
- పసుపు – ¼ టీ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- కారం – 1 టీ స్పూన్ (కారం ఎక్కువ తినేవాళ్లు పెంచుకోవచ్చు)
- నిమ్మరసం – 1 టీ స్పూన్
- నూనె లేదా నెయ్యి – 1 టేబుల్ స్పూన్
గ్రేవీ పేస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు
- తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు
- దాల్చినచెక్క – 2 ఇంచుల ముక్క
- అనాసపువ్వు – 1
- యాలకులు – 2
- లవంగాలు – 4
- బిర్యానీ ఆకు – 1
- మిరియాలు – ½ టీ స్పూన్
- ధనియాలు – 2 టీ స్పూన్లు
- గసగసాలు – 1 టీ స్పూన్
- నువ్వులు – 2 టీ స్పూన్లు
- జీడిపప్పు – 5
- ఎండు మిర్చి – 5
తయారీ విధానం
మటన్ మారినేషన్.. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, నూనె వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇలా చేస్తే మసాలా మటన్ కు పట్టేసి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది.
మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, దాల్చినచెక్క, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, ఎండు మిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
కుక్కర్ వేడయ్యాక నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంట తగ్గించి మరికొంత వేయించాలి. మారినేట్ చేసిన మటన్ ను కుక్కర్లో వేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి.
ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను కుక్కర్లో వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత కావలసినంత నీళ్లు పోసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి టేస్ట్ చెక్ చేయాలి. వేడిగా ఉండగానే అన్నం లేదా రోటీతో లాగించేయడమే. ఈ మటన్ కర్రీని నెయ్యితో తయారు చేస్తే రుచి మరింత అదిరిపోతుంది. ఈ రుచికరమైన బోనాల స్పెషల్ మటన్ కర్రీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.




