Vankaya Kachri: వంకాయ తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేసేలా.. పంజాబీ స్టైల్ క్రిస్పీ ‘బైంగన్ కచ్రీ’.. ఇలా చిటికెలో చేయండి!
చాలా మందికి వంకాయ కూర తినడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ వంకాయలో శరీరానికి ఎన్నో మేలు చేసే అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ వండే వంకాయ కూర కాకుండా, సాయంత్రం పూట వేడివేడి టీతో పాటు నంజుకోవడానికి పంజాబీ స్టైల్లో కరకరలాడే 'వంకాయ కచ్రీ' ఒక సరికొత్త స్నాక్గా ఉపయోగపడుతుంది. ఆ రెసిపీ చూసేద్దాం..

వంకాయతో ఎప్పుడూ ఒకే రకమైన పొడి కూర లేదా గ్రేవీ తిని బోర్ కొట్టిన వారికి ఈ బైంగన్ కచ్రీ ఒక అద్భుతమైన క్రిస్పీ రుచిని అందిస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. తక్కువ నూనెతో షాలో ఫ్రై చేస్తూ చేసుకునే ఈ వంటకం మధ్యాహ్న భోజనంలో పప్పు, అన్నంలోకి నంజుకోవడానికి సైడ్ డిష్గా కూడా ఎంతో అద్భుతంగా సెట్ అవుతుంది. దీనికి తయారు చేసుకోవడం సులభమే.
తయారీకి కావలసిన పదార్థాలు గుండ్రంగా, పెద్దగా ఉండే వంకాయలు – 2 గోధుమ పిండి – 1 కప్పు బొంబాయి రవ్వ – 1 కప్పు కారం పొడి – 2 టీస్పూన్లు పసుపు – 1 టీస్పూన్ కసూరి మెంతి పొడి – 1 టీస్పూన్ చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్ గరం మసాలా – 1 టీస్పూన్ ఆవ నూనె (Mustard Oil) – షాలో ఫ్రైయింగ్ కోసం పచ్చి మిరపకాయలు – 3 లేదా 4 (మధ్యలోకి కోసినవి) నల్ల ఉప్పు (Black Salt) – 1 టీస్పూన్ సాధారణ ఉప్పు – రుచికి తగినంత
మసాలాల మిశ్రమాన్ని పట్టించే పద్ధతి ఈ క్రిస్పీ వంకాయ కచ్రీ పర్ఫెక్ట్గా కుదరాలంటే ముందుగా రెండు తాజా, గుండ్రని పెద్ద వంకాయలను తీసుకోవాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి, మందంగా , గుండ్రటి చక్రాల లాంటి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల పైన రెండు వైపులా కొద్దిగా సాధారణ ఉప్పు , నల్ల ఉప్పును సమానంగా చల్లాలి. ఆ వెంటనే కారం, పసుపు, కసూరి మెంతి పొడి, చాట్ మసాలా , గరం మసాలా వేసి ముక్కలన్నింటికీ మసాలాలు బాగా పట్టేలా కలపాలి. ఉప్పు వేయడం వల్ల వంకాయలలోని సహజమైన నీరు నెమ్మదిగా బయటకు వస్తుంది. ఈ తేమ వల్లే మసాలాలు ముక్కలకు గట్టిగా పట్టుకుంటాయి. ఈ మసాలా ముక్కలను 10 నిమిషాల పాటు అలాగే పక్కన నాననివ్వాలి.
తవాపై క్రిస్పీగా… వంకాయ ముక్కలు నానేలోపు, స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి నాన్-స్టిక్ పెనం లేదా తవా పెట్టి కొద్దిగా ఆవ నూనె వేసి వేడి చేయాలి. సాంప్రదాయ పంజాబీ రుచి కోసం ఆవ నూనె వాడటం ఉత్తమం. మరోవైపు ఒక ప్లేటులో గోధుమ పిండిని, వేరొక ప్లేటులో బొంబాయి రవ్వను సమానంగా పరచాలి.
ఇప్పుడు మసాలా పట్టిన ఒక్కొక్క వంకాయ ముక్కను తీసుకుని మొదట గోధుమ పిండిలో రెండు వైపులా దొర్లించాలి. ఒకవేళ మీకు మరింత కరకరలాడే రవ్వ కోటింగ్ కావాలనుకుంటే, ఆ ముక్కను బొంబాయి రవ్వ ప్లేటులో వేసి రవ్వ చుట్టూ బాగా అంటుకునేలా చేయాలి. ఇలా కోటింగ్ ఇచ్చిన వంకాయ ముక్కలను కాగుతున్న తవాపై ఉంచాలి. మంటను మధ్యస్థంగా ఉంచి, రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ముక్కలు క్రిస్పీగా మారేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఆవ నూనెతో కాల్చుకోవాలి. వంకాయ లోపలి వరకు బాగా ఉడికిన తర్వాత, చివరగా పెనంపై పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలి. అంతే ఎంతో ఘాటుగా, నోరూరించే పంజాబీ స్టైల్ బైంగన్ కచ్రీ సిద్ధం. దీనిని వేడివేడిగా పుదీనా పచ్చ చట్నీ లేదా టమోటా సాస్తో తింటే రుచి అమోఘంగా ఉంటుంది.
