వందేళ్ల ఆరోగ్య రహాస్యం.. ఎండాకాలం కూల్ కూల్గా ఉంచే సూపర్ఫుడ్.. నిమిషాల్లోనే చేసుకోవచ్చు..
ఎండాకాలంలో నీరసం రాకుండా, శరీరాన్ని చల్లబరచడానికి ఆయుర్వేద నిపుణులు.. సంప్రదాయ వంటకాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. మన పూర్వీకుల వందేళ్ల రహాస్యం కూడా ఇదే ఆహారమని పేర్కొంటున్నారు. ఎండాకాలంలో రాగి అంబలి, చద్దన్నం, శక్తినిచ్చే పానీయాలు, ఫూల్ మఖనా రైతా వంటివి తక్షణ శక్తినిచ్చి, పొట్టను హాయిగా ఉంచుతాయి. ముఖ్యంగా రాగి అంబలిని పులియబెట్టి తయారుచేయడం ద్వారా ప్రోబయోటిక్స్ అందుతాయి.

ఎండాకాలం రాగానే శరీరం త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం సర్వసాధారణం. అటువంటి సమయంలో మన శరీరాన్ని చల్లబరచి, తక్షణ శక్తిని అందించే ఆహారం అవసరం.. అందుకే.. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన కొన్ని బలమైన, ఆరోగ్యకరమైన, సంప్రదాయ వంటకాలను తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.. ఈ వంటకాలు కేవలం రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. రాగి అంబలి, చద్దన్నం, శక్తినిచ్చే పానీయం, ఫూల్ మఖనా రైతా వంటివి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ.. కాపాడతాయి.. అంతేకాకుండా.. శరీరానికి శక్తినిస్తాయి.
వేసవి ప్రత్యేక వంటకాల్లో ప్రధానమైనది రాగి అంబలి. పూర్వీకులు వందల సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగించిన ఆహార రహస్యాలలో ఇది ఒకటి. రాగి అంబలి తయారీకి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల రాగిపిండిని అరకప్పు నీటిలో కలిపి కనీసం ఎనిమిది నుండి పది గంటల పాటు పులియబెట్టాలి. పిండి బాగా పులియడం వలన అంబలి రుచి మెరుగుపడుతుంది.. పోషకాలు పెరుగుతాయి. ముఖ్యంగా, పులియబెట్టడం ద్వారా మన శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ లభిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. పులియబెట్టిన పిండిలోని పై నీటిని కలి అంటారు. వీటితో చేసే అంబలి మరింత రుచికరంగా ఉంటుంది.
అంబలిని తయారుచేయడానికి, తగినంత నీటిని ఒక గిన్నెలో తీసుకుని.. వేడి చేసి, అందులోకి బాగా కలిపిన రాగిపిండిని కలపాలి.. పిండి ముద్దలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్మా రవ్వ లేదా జొన్న రవ్వను కలుపుకోవచ్చు. వేసవిలో అయితే నానబెట్టిన సగ్గుబియ్యం వాడటం కూడా చాలా మంచిది. రవ్వ కలిపాక, అంబలిని నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉడికించాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, అంబలి చిక్కబడే వరకు ఉడికించి, తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారాక మరింత చిక్కబడుతుంది.
తయారైన రాగి అంబలిని నేరుగా తీసుకోవచ్చు లేదా మరింత రుచి కోసం మజ్జిగ, నిమ్మరసం కలుపుకోవచ్చు. మజ్జిగ కలిపి తాగడం వలన మరింత చలవ చేస్తుంది. ఇందుకోసం ఇంట్లో తయారుచేసిన గడ్డ పెరుగును ఉపయోగించవచ్చు. పావు కప్పు నుండి అర కప్పు పెరుగును తీసుకొని, ముద్దలు లేకుండా కలిపి, అరకప్పు నీళ్లు కలిపితే మజ్జిగ సిద్ధమవుతుంది. ఈ మజ్జిగను అంబలిలో కలిపి తాగడం వలన ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
చద్దన్నం కూడా..
రాగి అంబలితో పాటు, చద్దన్నం, శక్తినిచ్చే పానీయం, ఫూల్ మఖనా రైతా వంటివి కూడా ఈ వేసవిలో తీసుకోవడం ద్వారా తక్షణ శక్తిని పొంది, వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.. రాత్రి వేళ అన్నంలో పెరుగు, కొన్ని ఉల్లి, మర్చి వేసి.. ఉంచి ఉదయాన్నే తినొచ్చు.. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది.. అలాగే శక్తినిస్తుంది.
ఈ సంప్రదాయ వంటకాలు కేవలం మన శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. ఈ వంటకాలను ప్రయత్నించి, వేసవిని ఆరోగ్యంగా గడపండి.
