Andhra: దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భోగాపురం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖలోని సింహాచలం ఆలయానికి దర్శనం వెళ్లి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన బైక్ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు, అతని అత్త, నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. హైవేపై ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏళ్ల సంచాన సాయి అనే యువకుడు(23), సాయి అత్త (40) , నాలుగేళ్ల సాయి భార్య అక్క కుమార్తె ఉన్నారు. ముగ్గురు కలిసి శ్రీకాకుళం నుంచి బైక్పై విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు దర్శనం కోసం వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో స్వామివారిని దర్శించుకొని తిరిగి శ్రీకాకుళం బయలుదేరారు. అలా బయలుదేరిన కొద్దిసేపటికి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దైవ దర్శనంకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ముగ్గురు మృతి స్థానికులను కంట తడి పెట్టిస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మితిమీరిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో పాటు ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జరిగిన ఘటన పై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. గత రెండు రోజులుగా జాతీయ రహదారుల పై జరుగుతున్న వరుస ప్రమాదాలు జిల్లావాసులను కలవరపెడుతోంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ముఖ్యంగా రాత్రి లేదా దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
