గోధుమ రోటీలు, చపాతీలు తింటున్నారా..? ఈ ఆయుర్వేద నియమాలు తెలుసుకోండి
Ayurveda Wheat Eating Rules: ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల వారే ఎక్కువగా గోధుమ చపాతీలు, రోటీలు తినేవారు. అయితే ఆరోగ్య కారణాలతో ఇప్పుడు ఇవి మన రోజువారీ ఆహారంలో భాగమైపోయాయి. అయితే గోధుమ చపాతీలు/రోటీలు వీటిని తినేటప్పుడు మూడు ముఖ్యమైన ఆయుర్వేద నియమాలను పాటించాలి. ఈ నియమాలు పాటించడం ద్వారా గోధుమలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. లేదంటే లాభానికి బదులు ఆరోగ్యానికి నష్టం కలిగించే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తుస్తున్నారు.

ఆయుర్వేదంలో గోధుమలను “గోధూమ” అని పిలుస్తారు. ఇది శరీరానికి బలాన్నిచ్చేదిగా, శీతల గుణం కలిగినదిగా, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేసేదిగా పరిగణించబడుతుంది. అయితే గోధుమలతో తయారు చేసిన చపాతీలు/రోటీల నుండి పూర్తి పోషకాలు లభించాలన్నా, అవి శరీరానికి హాని చేయకుండా ఉండాలన్నా ఈ 3 నియమాలు తప్పక పాటించాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం గోధుమ చపాతీలు/రోటీలు తినేటప్పుడు పాటించాల్సిన ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1: పాత గోధుమలనే ఉపయోగించండి
కొత్తగా పండిన గోధుమలను వెంటనే వాడటం వల్ల శరీరంలో ‘కఫం’ పెరుగుతుంది. దీనివల్ల బరువు పెరగడం, సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కనీసం ఒక ఏడాది పాతదైన గోధుమలను ఎంచుకోవడం మంచిది. పాత గోధుమలు అరుగుదలకు తేలికగా ఉంటాయి. ఇవి కఫాన్ని పెంచవు.
2: గోధుమ పిండిని జల్లించవద్దు (తవుడు/పొట్టు వేరు చేయకూడదు)
చాలామంది చపాతీలు మెత్తగా రావాలని పిండిని జల్లిస్తూ, అందులోని పొట్టును పారేస్తుంటారు. కానీ ఈ పొట్టులోనే శరీరానికి అవసరమైన ఫైబర్ (పీచు పదార్థం), ఐరన్ వంటి కీలక పోషకాలు ఉంటాయి. పిండిని జల్లించడం వల్ల ఈ పోషకాలన్నీ వృథా అవుతాయి. కాబట్టి పిండిని జల్లించకుండానే చపాతీలు చేసుకోవాలి.
3: మైదాను పూర్తిగా నివారించండి
గోధుమలతో చేసే రవ్వ లేదా దలియా (గోధుమ నూక) వంటివి ఆరోగ్యానికి మంచివే. కానీ మైదా పిండి మాత్రం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. శరీరానికి హాని చేస్తుంది. మైదాతో చేసే బేకరీ పదార్థాలు, నాన్, పిజ్జా వంటి జంక్ ఫుడ్కు వీలైనంత దూరంగా ఉండాలి. అందుకే మీరు గోధుమ రొట్టేలు చేసేటప్పుడు మైదాను కలిపే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.
ఈ మూడు నియమాలతో గోధుమలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియమాలను పాటించకుండా చెపాతీలు/రొట్టెలు తింటే ఆరోగ్యానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు




