కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..
మనుషులకు గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తుంటారు. గోల్డెన్ అవర్ లో చికిత్స అందిస్తే బతుకుతారు. అయితే సిపిఆర్తో మనుషుల ప్రాణాలే కాదు మూగ జీవుల ప్రాణాలు కూడా రక్షించవచ్చని నిరూపతమైంది. అనారోగ్యానికి గురై గుండెపోటు వచ్చిన కొండముచ్చుకు సిపిఆర్ చేసి పునర్జన్మను ప్రసాదించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా బరకత్ గూడెంకు చెందిన రామయ్యకు రైస్ మిల్ తో జీవనోపాధి పొందుతున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. ఈ వానరుల దాడి నుంచి మిల్లుకు వచ్చే ధాన్యం, బియ్యాన్ని రక్షించుకునేందుకు ఏపీలోని నూజివీడు నుండి కొద్ది రోజుల క్రితం కొండముచ్చును కొనుగోలు చేశాడు. అక్కడినుంచి కొండముచ్చును బరకత్ గూడేనికి తీసుకువచ్చి.. పెంచుకుంటున్నాడు.. కొద్దిరోజులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఇటీవల కొన్నీ రోజులుగా తిండి తినకపోవడంతో నీరసంగా కనిపించింది. ఉన్నట్టుండి కొండముచ్చు శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. కంగారు పడిన యజమాని వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ పశువుల ఆసుపత్రికి తరలించారు. తిండి తినక నీరసంగా ఉండడంతో బిపి, శరీర ఉష్ణోగ్రత పడిపోయి కోమాలోకి వెళ్లిందని డాక్టర్ పెంటయ్య చెప్పారు.
అయితే, చికిత్స అందిస్తున్న సమయంలో కొండముచ్చుకు మరోసారి గుండెపోటు వచ్చే శరీరం చల్లబడింది. వెంటనే అప్రమత్తమైన డాక్టర్ సీపీఆర్ నిర్వహించి గుండె స్పందన, శ్వాస తిరిగి వచ్చేవరకు కాళ్లు మర్దన చేశాడు. కొండముచ్చు ను ఇన్ పేషంట్ గా ఉంచుకొని నాలుగు గంటల పాటు చికిత్స అందించి బతికించాడు. పూర్తిగా కోలుకున్నాక ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేశారు. కొండముచ్చుకు డాక్టర్ పునర్జన్మ ప్రసాదించడం సంతోషంగా ఉందని యజమాని చెప్పాడు.. పశువుల ఆసుపత్రి వైద్యుల సేవలు సకాలంలో అందడంతో.. కొండముచ్చు బతికిందని పేర్కొన్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
