తహసీల్దార్ ఆకస్మిక బదిలీ : లంచం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని హామీ
కుమ్రుం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి తహసీల్దార్ ఖాజా నియాజుద్దీన్ ట్రాన్స్ ఫర్ అయ్యారు ఆయన ప్లేసులో బికర్ణదాస్ బాధ్యతలు చేపట్టారు.
Tahsildar promise to return bribes : కుమ్రుం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి తహసీల్దార్ ఖాజా నియాజుద్దీన్ ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయన ప్లేసులో బికర్ణదాస్ బాధ్యతలు చేపట్టారు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా. కానీ ఇక్కడో స్పెషాలటీ ఉంది. ఎందుకంటే.. ట్రాన్స్ ఫర్ అయిన తహసీల్దార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో రైతు సమస్యలు పరిష్కారిస్తానని చెప్పి లంచం తీసుకున్నారు. ఆయన ఏదైనా పని చెయ్యాలంటే టేబుల్ కింద చేయి తడి చేయాల్సిందేనట. అయితే బదిలీ విషయం తెలుసుకున్న డబ్బులు ఇచ్చిన రైతులు తహసీల్దార్ నియాజుద్దీన్ను నిర్బంధించారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే.. పనులు కంప్లీట్ చేసి వెళ్లాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొత్త తహసీల్దార్ గురువారం కార్యాలయానికి వచ్చారు. దీంతో ఆగ్రహించిన రైతులు తీసుకున్న తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆందోళన మరింత తీవ్రం చేశారు. ఓ దశలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో బదిలీ అయిన ఆ తహసీల్దార్ తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్దమయ్యారు.
తాను ఏయే రైతు దగ్గర ఎంత మేర డబ్బులు తీసుకున్నాననే విషయం పేపర్ మీద రాసి.. 18వ తేదీలోగా చెల్లిస్తానని సంతకం చేశారు. ఆయన లంచాల రూపంలో రూ.10 లక్షల వరకు తీసుకున్నారని రైతుల నుంచి అందుతోన్న సమాచారం. లంచం తీసుకున్నట్లు ఒప్పుకుని.. రైతులకు ఈ తరహా భరోసా లేఖ ఇచ్చిన తహసీల్దార్ మీద ఉన్నతాధికారుల చర్యలు ఏ రకంగా ఉంటాయో చూడాలి. ఒక్కో రైతు నుంచి దాదాపు రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు తహసీల్దార్ లంచం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఊహించకుండా ఒక్కసారే బదిలీ అవ్వడం వల్ల రైతుల సమస్యలను ఆయన పరిష్కరించలేకపోయాడు. దీంతో అంగీకార పత్రం రాయక తప్పలేదు. దీంతో ఆందోళన విరమించారు రైతులు.
Read More : ఆగస్టు నెలలో స్థిరంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా