బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు

ఆ గానం మూగబోయింది. పాడుతా తీయగా అంటూ పాడిన ఆయన స్వరం మన చెవుల నుంచి దూరంగా వెళ్లింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గాన గంధర్వుడు పరలోక పయనమయ్యాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు
Follow us

|

Updated on: Sep 26, 2020 | 11:53 AM

ఆ గానం మూగబోయింది. పాడుతా తీయగా అంటూ పాడిన ఆయన స్వరం మన చెవుల నుంచి దూరంగా వెళ్లింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గాన గంధర్వుడు పరలోక పయనమయ్యాడు. 1946 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్ననాటి నుంచే సంగీతం మీద మక్కువ ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ ప్రముఖుల ప్రశంసలతో పాటు అనేక బహుమతులు అందుకున్నాడు. 1966 లో తొలిసారిగా పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.

నెల్లూరు లో బాల్యం..

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటం ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయంతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు బాలు…

రివార్డులు – అవార్డులు

దేశవ్యాప్తంగా అన్ని భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు పాడిన రికార్డు ఆయన సొంతం. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. దక్షిణాదిలో ఆయనకు తిరుగులేని గాయకుడిగా అవతరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు బాలు.. అలాగే 2001లో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999) గౌరవ డాక్టరేట్ తో ఆయనను గౌరవించుకుంది. అప్పటి గవర్నర్ రంగరాజన్ చేతులమీదుగా పద్మభూషణ్ (2011) అందుకున్నారు. శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నంది పురస్కారం – 2012 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి (మిథునం చిత్రానికి గానూ ఆయనకు దక్కింది.

నటుడిగా ప్రస్థానం…

1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రం ద్వారా తొలిసారిగా నటుడిగా వెండితెరపై కనిపించాడు బాలు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదించారు. అంతేకాకుండా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.

డబ్బింగ్ ఆర్టిస్టుగా..

బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కు తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టాయి.

దాన గుణం…

బాలసుబ్రమణ్యం సింగర్ గానే కాకుండా పలు సేవా కార్యక్రమాలు సైతం నిరవహించేవాడు..తన సొంత జిల్లా అయిన నెల్లూరుపై ఎనలేని మమకారం బాలుకు ఉండేది.. బాలు తండ్రి గత కొంత కాలం క్రితం కాలం చేయడంతో ఆయన గుర్తుగా బాలు తండ్రి వుండే ఇంటిని కంచి పీఠాధిపతికి అప్పగించారు.. ఆ ఇంటిని వేద పాఠశాల నిర్వహణకు అప్పగించాడు బాలు.