పార్లమెంటులో కరోనాపై యుద్ధం…భవనాలు, పరిసరాల్లో విస్తృతంగా పారిశుద్ధ్యం
కరోనా భయంతో ఆందోళన చెందుతున్న పార్లమెంట్ సభ్యులు, సిబ్బందికి భరోసా కల్పించడం కోసం లోక్సభ స్పీకర్ ఓంబిర్లా చర్యలు చేపట్టారు. కీలక అధికారులతో సమీక్ష నిర్వహించి పార్లమెంట్ ప్రాంగణంలోని అన్ని భవనాలు, పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని, క్రిమిసంహారక ద్రావణాలతో శానిటైజ్ చేయాలని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో శనివారం రంగంలోకి దిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) పారిశుద్ధ్య సిబ్బంది పార్లమెంట్ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసే పనిలో పడ్డారు. భవనాలను ముందు హైప్రెజర్ వాటర్ పంప్ […]
కరోనా భయంతో ఆందోళన చెందుతున్న పార్లమెంట్ సభ్యులు, సిబ్బందికి భరోసా కల్పించడం కోసం లోక్సభ స్పీకర్ ఓంబిర్లా చర్యలు చేపట్టారు. కీలక అధికారులతో సమీక్ష నిర్వహించి పార్లమెంట్ ప్రాంగణంలోని అన్ని భవనాలు, పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని, క్రిమిసంహారక ద్రావణాలతో శానిటైజ్ చేయాలని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో శనివారం రంగంలోకి దిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) పారిశుద్ధ్య సిబ్బంది పార్లమెంట్ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసే పనిలో పడ్డారు. భవనాలను ముందు హైప్రెజర్ వాటర్ పంప్ ఉపయోగించి శుభ్రం చేశారు. అనంతరం క్రిమిసంహారక ద్రావణాలను స్ప్రే చేయడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్ నిరోధక రసాయనాలతో సభ్యులు కూర్చునే సీట్లు, ఉపయోగించే మైకులను శుభ్రం చేశారు. ఆదివారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాన భవనంతో పాటు పార్లమెంట్ లైబ్రరీ భవనం, పార్లమెంట్ అనెక్స్ భవనం, రిసెప్షన్, సెక్యూరిటీ విభాగం, సెంట్రల్ పాస్ ఇష్యూయింగ్ సెంటర్ వంటి మరికొన్ని భవనాలు ఉన్నాయి. అన్నింటిలోనూ ఈ చర్యలు చేపట్టాల్సిందిగా స్పీకర్ ఓంబిర్లా స్పష్టమైనా ఆదేశాలిచ్చారు. అందుకే ఆరోగ్యశాఖ సిబ్బంది పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు ఈ పనులను కొనసాగిస్తున్నారు.
కనిక తెచ్చిన తంటా!
నిజానికి ఈ తరహా చర్యలు చేపట్టడం వెనుక కారణం బాలీవుడ్ గాయని కనికా కపూర్. యూకే నుంచి ఈ మధ్యనే తిరిగి వచ్చిన ఆమె యూపీ రాజధాని లఖ్నవూలో ఓ స్టార్ హోటళ్లో ఏర్పాటు చేసిన వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు వెలుగుచూడడంతో శుక్రవారం వైద్యపరీక్షలు నిర్వహించగా, కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో వెంటనే ఆమె ఎవరెవరిని కలిశారో తెలుసుకునే ప్రయత్నాలు చేయగా, వేడుకకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు, సీనియర్ బ్యూరోక్రాట్లు హాజరైనట్టు గుర్తించారు. అయితే పార్లమెంట్ సభ్యుడైన దుష్యంత్ సింగ్ అప్పటికే వరుసగా రెండు రోజులు పార్లమెంట్ సమావేశాలకు, స్టాండింగ్ కమిటీ మీటింగులకు హాజరైనట్టు గుర్తించారు. ఈ క్రమంలో దుష్యంత్ సింగ్ కూర్చునే వరుసలో ఆయన పక్కన, ముందు, వెనుక వరుసల్లో కూర్చునే పార్లమెంట్ సభ్యులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలోనూ దుష్యంత్ సింగ్ హాజరైనందున, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సైతం కరోనా పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కనికా కపూర్తో పాటు పార్టీకి హాజరైన దుష్యంత్ సింగ్, వసుంధరా రాజేలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా లేదని తేలింది. అయినా సరే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిద్దరూ మరికొన్నాళ్లపాటు స్వీయ నిర్బంధం కొనసాగిస్తామని తెలిపారు. దుష్యంత్ వ్యవహారంతో పార్లమెంట్లో ఇతర ఎంపీలు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ఓంబిర్లా పార్లమెంటును పూర్తిగా శుభ్రం చేసేందుకు ఆదేశించారు.
మహాత్మా కొడియార్, టీవీ 9 ప్రతినిధి