Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్లో నెయ్యి, నూనె డబ్బాలు తీసుకెళ్తున్నారా..? రైల్వే రూల్స్ ఏంటో తప్పక తెలుసుకోండి!
భారతదేశంలో ఎక్కువ మంది సుదూర ప్రయాణాల కోసం రైల్వేనే ఎంచుకుంటారు. ముఖ్యంగా పండగలకు, సెలవులకు ఊళ్లకు వెళ్లినప్పుడు తిరుగు ప్రయాణంలో అమ్మమ్మలు, అమ్మలు ప్రేమతో ఇచ్చే నెయ్యి, గానుగ నూనె, ఆవకాయ పచ్చళ్లను మూటగట్టుకుని వస్తుంటాం. అయితే, లగేజీ సర్దుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం అన్ని వస్తువులను రైలులోకి అనుమతించరు. ముఖ్యంగా నెయ్యి, నూనె వంటి పదార్థాల విషయంలో ఐఆర్సిటిసి (IRCTC) కఠినమైన నియమాలను అమలు చేస్తోంది. అవేంటో తప్పక తెలుసుకోవాలి..

సొంతూళ్లకు వెళ్లినప్పుడు చాలా మంది ఇంట్లో తయారుచేసిన నెయ్యి, నూనె లేదా పచ్చళ్లను తిరుగు ప్రయాణంలో వెంట తెచ్చుకుంటారు. అయితే, భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రైలు ప్రయాణంలో ద్రవరూపంలో ఉండే నెయ్యి లేదా నూనెను తీసుకెళ్లడంపై కొన్ని కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. రైలు ప్రయాణంలో నెయ్యి (Ghee) లేదా నూనె వంటి పదార్థాలను తీసుకెళ్లడానికి సంబంధించిన భారతీయ రైల్వే నిబంధనల గురించి ప్రతి ఒక్కరికీ తప్పక తెలిసి ఉండాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..
రైల్వే చట్టం ప్రకారం, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రమాదకరమైన, పేలుడు సంభవించే లేదా త్వరగా మంటలు అంటుకునే ఏ వస్తువునైనా రైలులో తీసుకెళ్లడం నేరం. నెయ్యి, వంట నూనెలు ద్రవరూపంలో ఉండి, అధిక ఉష్ణోగ్రత వద్ద త్వరగా నిప్పు అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ ప్రయాణంలో ఇవి లీక్ అయి కోచ్ అంతటా వ్యాపిస్తే, చిన్న నిప్పురవ్వ తగిలినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని లగేజీగా తీసుకెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయి.
ఒకవేళ మీరు నెయ్యి లేదా నూనెను కేవలం సాధారణ ప్లాస్టిక్ కవర్లలోనో లేదా లూజ్ మూత గల డబ్బాల్లోనో పెట్టి, అది లీక్ అవుతూ రైల్వే సిబ్బందికి పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయి. రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదకర వస్తువులను రవాణా చేస్తే రూ. 1,000 వరకు జరిమానా విధించవచ్చు లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష (లేదా రండూ) పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీ వల్ల తోటి ప్రయాణికుల లగేజీ పాడైతే దానికి మీరే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
రైలులో నెయ్యి తీసుకువెళ్లవచ్చా?:
అయితే, నెయ్యిని పూర్తిగా నిషేధించలేదు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, నూనె, పెయింట్, నెయ్యి వంటి ఆయిల్ సంబంధిత వస్తువులు సున్నితమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి లీక్ అయితే కంపార్ట్మెంట్లో కాలుష్యం, భద్రతా సమస్యలు తలెత్తవచ్చు. అయినప్పటికీ, కొన్ని షరతులతో ప్రయాణికులను నెయ్యిని తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం, ఒక ప్రయాణికుడు రైలులో గరిష్టంగా 20 కిలోల నెయ్యిని తీసుకువెళ్లవచ్చు. కానీ, అది సరిగ్గా సీల్ చేయబడి ఉండాలి.
సురక్షితంగా ఎలా తీసుకెళ్లాలి?:
మీరు నెయ్యి లేదా నూనెను తీసుకెళ్లాలనుకుంటే, వాటిని లీక్-ప్రూఫ్ (Leak-proof) కంటైనర్లలో ఉంచాలి. డబ్బా మూత గట్టిగా ఉండి, దానిపై ప్లాస్టిక్ టేప్ చుట్టాలి. ఆపై దాన్ని ఒక మందపాటి కవర్లో పెట్టి లగేజీ మధ్యలో సురక్షితంగా ఉంచాలి. కమర్షియల్ ప్రయోజనాల కోసం (అమ్మడానికి) బల్క్ మొత్తంలో తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా పార్సిల్ ఆఫీస్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, తదుపరిసారి రైలు ప్రయాణం చేసేటప్పుడు మీ లగేజీ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.




