నేడు ఆకాశంలో అద్బుతం.. అతి సమీపంలోకి రానున్న బృహస్పతి, శని గ్రహాలు.. వాటి మధ్య దూరం ఎంతంటే..!
నేడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి, శని గ్రహాలు పరస్పర దగ్గర కానున్నాయి. కొన్ని గంటల పాటు .....
నేడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి, శని గ్రహాలు పరస్పర దగ్గర కానున్నాయి. కొన్ని గంటల పాటు ఈ గ్రహాలు కలిసే ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అతి ప్రకాశవంతమైన బృహస్పతి, శని గ్రహాలు రెండు 0.1 డిగ్రీల దూరంలో ఒకదానికొకటి అతి సమీపంగా వస్తాయంటున్నారు. క్రీస్తు శకం 1623లో బృహస్పతి, శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పటికీ సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల అవి కనిపించలేదని చెబుతున్నారు. అయితే సోమవారం నాటి గ్రహాల కలయికను నేరుగా చూసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తరార్ధగోళంలో జరిగే గ్రహ సముచ్చయాన్ని స్టార్ ఆఫ్ బెత్లెహేమ్గా అభివర్ణిస్తారన్నారు. ఇది మళ్లీ 2080 మార్చి 15న ఉంటుందని పేర్కొంటున్నారు.
మిగతా గ్రహాలకు భిన్నంగా శని కలయిక చాలా అరుదు. సౌర కుటుంబంలోనే అతి పెద్దదైన గురు గ్రహం సూర్యునినుంచి ఐదవది. రెండో అతిపెద్ద గ్రహమైన శని..సూర్యునినుంచి ఆరోది. సూర్యుని చుట్టుూ తిరగడానికి గురుడికి 12 ఏళ్లు పడితే, శనికి 30 ఏళ్లు పడుతుంది. పరిభ్రమణ సమయంలో ప్రతి 20 ఏళ్లకోసారి ఇవి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. అత్యంత దగ్గరగా ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటిది సోమవారం ఆవిష్కృతం కానున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది సంయోగం చివరి సారిగా 1623లో కనిపించినట్లు చెప్పారు.
తాజాగా రెండు గ్రహాలు పరస్పర దగ్గరగా వచ్చినట్లు కనిపించినప్పటికీ, ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. ముందుభాగంలో ఉండే గురు గ్రహం.. అప్పుడు భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెబుతున్నారు.