ఆఫ్ఘన్లో బాంబు పేలుడు.. 15 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
ఆప్ఘనిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తూర్పు ఆప్ఘనిస్తాన్లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఆప్ఘనిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తూర్పు ఆప్ఘనిస్తాన్లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దాదాపు 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా బాంబు పేలుడు జరిగినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారీఖ్ అరియన్ వెల్లడించారు.
గిలాన్ జిల్లాలోని గజినీ ప్రావిన్స్లో ఓ ఇంట్లో మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా.. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా, ఈ పేలుడుకు కారణం తాలిబన్ల పనేనని భద్రతా బలగాలు ప్రాథమికంగా భావిస్తున్నాయి. గజినీ ప్రావిన్స్లో ప్రభుత్వ బలగాలకు, తాలిబన్లకు నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంది. ఆ ప్రాంతం కాల్పుల మోతతో అట్టుడుకుతూనే ఉంది.