సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చారో.. చైనాకు ఇండియా వార్నింగ్
నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని..
నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. లదాఖ్ తూర్పు ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలి.. బలప్రయోగంతో యధాతథ స్థితిని మార్చడం ఏ మాత్రం సరికాదు అని చైనాలో భారత రాయబారి విక్రం మిస్రీ అన్నారు. చైనా చర్యలు ఉభయ దేశాల సంబంధాలకు అవరోధం కలిగించేవిగా, పరస్పర విశ్వాసాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గాల్వన్ లోయలో భారత ‘సార్వభౌమాధికారాన్ని’ సహించబోమన్న చైనా రాయబారి సన్ వీడాంగ్ ప్రకటనను ఆయన ఖండించారు. ఉభయ దేశాల సైనికాధికారుల చర్చల్లో తాము శాంతికి కట్టుబడి ఉంటామని చెప్పే చైనా మాటలకు, చేతలకు పొంతన లేదని మిస్రీ ఆరోపించారు. భారత దేశమే ఉద్రిక్తతల నివారణకు చర్యలు తీసుకోవాలన్న ఆయన వ్యాఖ్యలను మిస్రీ గర్హించారు. ప్రస్తుత పరిస్థితికి మీరే కారణమని కౌంటరిచ్చారు.