ప్రజ్ఞాన్ రోవర్‌ జాడ దొరికిందట..!

చంద్రుడిపై కూలిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన చెన్నైకి చెందిన యువ ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ తాజాగా మరో ఘనత సాధించారు. చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి పంపిన ప్రజ్ఞాన్ రోవర్‌ను కూడా గుర్తించినట్టు షణ్ముగ ప్రకటించారు.

ప్రజ్ఞాన్ రోవర్‌ జాడ దొరికిందట..!
Follow us

|

Updated on: Aug 03, 2020 | 3:47 AM

చంద్రుడిపై కూలిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన చెన్నైకి చెందిన యువ ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ తాజాగా మరో ఘనత సాధించారు. చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి పంపిన ప్రజ్ఞాన్ రోవర్‌ను కూడా గుర్తించినట్టు షణ్ముగ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని మెయిల్‌ ద్వారా అంతరిక్ష ప్రయోగసంస్థ (ఇస్రో)కు కూడా తెలిపినట్టు వెల్లడించారు. షణ్ముగ ప్రకటనపై ఇస్రో చైర్మన్‌ కే. శివన్‌ స్పందించారు. ఆయన తమకు పంపిన చిత్రాలను ఇస్రో నిపుణులు పరిశీలిస్తున్నారని తిరిగి రీట్వీట్‌ చేశారు.

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగించింది. చంద్రుడిపై ప్రయోగాల కోసం ఇస్రో గతేడాది జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌-2 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్‌-2 మిషన్‌లో విక్రమ్‌ ల్యాండర్‌ను, ప్రజ్ఞాన్ రోవర్‌ను పంపింది. 2019 ఆగస్టు 20న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుండగా విక్రమ్‌ ల్యాండర్‌ అదుపుతప్పి చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. భూమితో సంబంధాలు తెగిపోయిన దానిని చాలారోజులు వెదికినా ఇస్రో కనిపెట్టలేకపోయింది. కానీ, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సాయంతో షణ్ముగ సుబ్రమణియన్‌ విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తాజాగా ల్యాండర్‌లోని ప్రజ్ఞ రోవర్‌ను కూడా గుర్తించారు. స్పేస్‌ ఇంజినీర్‌ కానప్పటికీ షణ్ముగ, వ్యక్తిగత ఆసక్తితోనే ఈ ఘనత సాధించారు.

చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ చెక్కుచెదరకుండా సురక్షితంగా ఉందన్నారు షణ్ముగ. కూలిన ప్రదేశంనుంచి కొన్ని మీటర్ల దూరంలో రోవర్‌ ఉన్నట్టు షణ్ముగ తెలిపారు. రోవర్‌ భూమినుంచి ఆదేశాలు అందిస్తే స్పందించే అవకాశం కూడా ఉందన్నారు. అయితే, అది తిరిగి భూమికి సందేశాలు పంపే అవకాశం లేకపోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే తమ వ్యోమ నౌకలను చంద్రుడిపై విజయవంతంగా దింపగలిగాయి. ఇదిలావుంటే ఇస్రో కూడా షణ్ముగ వాదనలను ఏకభవించింది. కానీ, ఖచ్చితమైన ఆధారాలు లభించాల్సి ఉందన్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. ఇక, షణ్ముగ సుబ్రమణియన్‌ పరిశోధనల పట్ల సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది.