ఆధార్ ఆపరేటర్ వేలిముద్రలు చోరి, దుర్వినియోగం.. బయటికొచ్చిన ఆధారాలు
యూనిక్ ఐడీ(ఆధార్) పేరుతో మన సమాచారం మొత్తం 12 అంకెలున్న కార్డులో ఫీడ్ చేసింది భారత ప్రభుత్వం. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, పన్ను చెల్లింపులు ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఆ కార్డుతో ముడిపడిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సేఫ్ కాదు అంటూ పలువురు చెబుతూ వస్తుండగా.. వాటినన్నంటిని యుఐడీఏఐ(యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొట్టేస్తూ వస్తోంది. కానీ తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన కేసులో వినియోగదారుడి వేలిముద్రలు చోరి కాబడి, […]
యూనిక్ ఐడీ(ఆధార్) పేరుతో మన సమాచారం మొత్తం 12 అంకెలున్న కార్డులో ఫీడ్ చేసింది భారత ప్రభుత్వం. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, పన్ను చెల్లింపులు ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఆ కార్డుతో ముడిపడిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సేఫ్ కాదు అంటూ పలువురు చెబుతూ వస్తుండగా.. వాటినన్నంటిని యుఐడీఏఐ(యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొట్టేస్తూ వస్తోంది. కానీ తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన కేసులో వినియోగదారుడి వేలిముద్రలు చోరి కాబడి, దుర్వినియోగం అయ్యాయని ఆధారాలతో సహా బయటికొచ్చాయి.
గతేడాది హర్యానాకు చెందిన షియోఖండ్ అనే ఆధార్ ఆపరేటర్ వేలి ముద్రలు పలుచోట్ల ఒకేరోజు దుర్వినియోగం అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆధార్ ఆపరేటర్గా పనిచేస్తోన్న షియోఖండ్ వేలిముద్రలు నవంబర్ 12, 2018న నాలుగు వేర్వేరు ప్రదేశాలలో వినియోగించబడ్డాయి. దీంతో అతడి కార్డును తాత్కాలికంగా నిలిపివేసింది ఆధార్ సంస్థ. మరోవైపు మోసం కేసులో షియోఖండ్ను ఉద్యోగం నుంచి తీసేశారు అతడు పనిచేసే సంస్థ అధికారులు.
దీనిపై మాట్లాడిన షియోఖండ్.. ఒక స్థానంలో పనిచేస్తూ ఒక రోజులో అన్ని స్థానాలు ప్రయాణించేందుకు తానేం దయ్యాన్ని కాదని అన్నారు. గతేడాదే ఆధార్ను అధికారులు బ్లాక్ చేసినప్పటికీ ఇప్పటికీ తన నంబర్ను వాడుతున్నారని.. దానికి సంబంధించిన మెయిల్స్ ఇంకా తనకు వస్తున్నాయంటూ ఆయన తన బాధను వ్యక్తపరిచాడు. తన ఆధార్ వివరాలతో రూ.33లక్షలకు సంబంధించిన మోసపూరిత లావాదేవీలు జరిగాయని, ఆ మొత్తాన్ని తన మీద పెనాల్టీగా వేశారని షియోఖండ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఆధార్ ఆపరేటర్గా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న షియోఖండ్ ప్రస్తుతం ఓ మారుమూల గ్రామంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అక్కడ గ్రామస్తులు పలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేలా అతడు సహాయం చేస్తున్నాడు. వీటిలో కొన్ని పనులకు తనకు ఆధార్ అవసరం అవుతుందని కానీ ప్రభుత్వం తనకు అనుమతిని ఇవ్వలేదని షియోఖండ్ చెప్పారు. అయితే ఇది ఒక వ్యక్తికే పరిమితం అవ్వలేదు. పలువురికి సంబంధించిన బయోమెట్రిక్లు దుర్వినియోగం అవుతున్నాయని, వారిలో షియోఖండ్ ఒకరని కొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో ఆధార్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.