ప్రయాణికులకు మరింత చేరువగా ఏపీఎస్ఆర్టీసీ.. ఇకపై సేవలన్నింటికీ ఒకే యాప్.. అందుబాటులోకి బస్ ట్రాకింగ్ సిస్టమ్
మారుతున్న కాలనుగుణంగా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ సేవలన్నింటిని ఒకే యాప్ ద్వారా అందించేందుకు ఏర్పాట్టు చేస్తోంది.

ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మారుతున్న కాలనుగుణంగా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ సేవలన్నింటిని ఒకే యాప్ ద్వారా అందించేందుకు ఏర్పాట్టు చేస్తోంది.
ఇకపై ప్రయాణిస్తున్న బస్లో సైతం ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో అరచేతిలో చూసుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది. అవసరమైతే యాప్లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ముందుగా టికెట్ బుక్ చేసుకున్న బస్ను ప్రయాణికుడు అందుకోలేకపోయినా.. అదే రూట్లో తర్వాత వచ్చే మరో సర్వీసులోకి మార్చుకునే అవకాశం రానుంది. ఇలా దాదాపు 12 నుంచి15 రకాల సేవలను ఒకే యాప్లో లభించేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ను ఏపీఎస్ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం ఆర్టీసీలో ప్రయాణికుల కోసం ఆన్లైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్, పార్శిల్ బుకింగ్లకు మూడు వేర్వేరు యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఈ సేవలన్నీ ఒకే యాప్లో లభించనున్నాయి. సెంట్రల్ కమాండ్ సెంటర్, ట్రాకింగ్ డివైజులు, సర్వర్, ఈ పోస్ యంత్రాలు తదితరాల కోసం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.70 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిజిటలైజేషన్ ప్రోత్సాహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్కు కేంద్రం రూ.20 కోట్లు సాయం అందించనుంది. ఇందుకు సంబంధించి వచ్చేనెలలో టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. యాప్ ద్వారా బుక్ అయ్యే ఒక్కో టికెట్కు సగటున 15 పైసల చొప్పున టెండరు దక్కించుకునే సంస్థకు కమిషన్కు లభించే వీలుందని అంచనా వేస్తున్నారు.
కొత్త యాప్ అందుబాటులోకి వచ్చాక, పల్లెవెలుగు, సిటీ బస్సులు మొదలుకొని దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని తరహా బస్సుల టికెట్లను యాప్లో బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతి బస్సు ప్రయాణానికి సంబంధించి ట్రాకింగ్లో కనిపిస్తుంది. ఎంత సమయానికి బస్టాండ్ వస్తుందో చూసుకొని ప్రయాణికులు వెళ్లేందుకు వీలుంటుంది. ప్రస్తుతానికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం ఉన్న బస్సుల ట్రాకింగ్ మాత్రమే ఈ సిస్టమ్ అందుబాటులో ఉంది. అలాగే సరుకు రవాణాకు సంబంధించి ఛార్జీల వివరాలు, సరుకులకు సంబంధించి ట్రాకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ఫ్లాన్ చేస్తోంది.




