మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా..? సోషల్ మీడియా విడిచి ఉండలేకపోతున్నారా..?
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. కానీ దీన్ని ఎక్కువగా వాడటం శరీరానికీ, మనసుకీ తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త పరిశోధన ప్రకారం ఫోన్ అధిక వినియోగం డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు దారి తీస్తోంది. కాబట్టి ఫోన్ వాడకాన్ని నియంత్రించడం చాలా అవసరం.

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా బతకడం చాలా కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. కానీ ఇలా ఫోన్ ను ఎక్కువగా వాడటం మన శరీరానికి, మనసుకు చాలా హానికరం. గంటల కొద్దీ వీడియోలు, సోషల్ మీడియా చూడటం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది.
కొత్త పరిశోధన ఏం చెబుతోంది..?
2023లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ఒక పరిశోధన వచ్చింది. ఈ అధ్యయనంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న 655 మందిని పరిశీలించారు. ఫోన్ ఎక్కువగా వాడేవారు డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడం ఫోన్ ఎక్కువగా వాడటం వల్లే అని ఈ అధ్యయనం చెప్పింది.
మానసిక సమస్యలకు కారణాలు
- ఈ పరిశోధన ప్రకారం.. మానసిక సమస్యలకు చాలా కారణాలున్నాయి. వాటిలో ఫోన్ వాడకం ఒక ముఖ్యమైన కారణం.
- 40 శాతం సమస్యలు సోషల్ మీడియా వాడకం వల్ల వస్తున్నాయి.
- 12 శాతం సమస్యలు నిద్రలేమి వల్ల వస్తున్నాయి.
- 13 శాతం సమస్యలు కుటుంబంలో సమస్యల వల్ల వస్తున్నాయి.
- 10 శాతం సమస్యలు సైబర్ వేధింపుల వల్ల వస్తున్నాయి.
ఫోన్ వాడకం తగ్గించడం ఎలా..?
- మీ ఫోన్కు వచ్చే అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి.
- రోజులో ఎంతసేపు ఫోన్ వాడాలి అనే సమయ పరిమితి పెట్టుకోండి.
- సోషల్ మీడియా కోసం రోజుకు 30 నిమిషాల టైమర్ పెట్టుకుని.. ఆ సమయం అయిపోగానే లాగ్ అవుట్ చేయండి.
సోషల్ మీడియాలో చెడు వార్తలు ఎక్కువగా చూడటం మానేసి.. పుస్తకాలు చదవండి, వాకింగ్ చేయండి లేదా కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపండి.




