పిల్లలు, వృద్ధులకు డెంగ్యూ ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
వర్షాకాలంలో డెంగ్యూ జ్వర ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాల్లా కనిపించినా.. కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు ఉంటాయి. వాటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు.

వర్షాకాలం చల్లటి వాతావరణం మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ వర్షంతో పాటు కొన్ని ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు బాగా పెరుగుతాయి. వీటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. అందుకే దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
డెంగ్యూ జ్వరం అంటే ఏంటి..?
డెంగ్యూ అనేది Aedes aegypti అనే దోమ కాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి నేరుగా వ్యాపించదు. కేవలం దోమ కాటు ద్వారా మాత్రమే వస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే చోట దోమలు ఎక్కువ కాబట్టి డెంగ్యూ వ్యాప్తికి ఇది ప్రధాన కారణం.
డెంగ్యూ ప్రధాన లక్షణాలు
- డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాల లాగే ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను బట్టి దాన్ని గుర్తించవచ్చు
- హై ఫీవర్.. ఉన్నట్టుండి జ్వరం వస్తుంది. ఇది 2 నుంచి 7 రోజులు ఉంటుంది.
- తీవ్రమైన తలనొప్పి.. ముఖ్యంగా కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది.
- బాడీ పెయిన్స్.. కీళ్లు, కండరాల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు.
- వాంతులు.. తల తిరగడం, వాంతులు అవుతాయి. వీటి వల్ల డీహైడ్రేషన్ రావచ్చు.
- శరీర బలహీనత.. బాడీ వీక్ నెస్, అలసట ఉంటుంది. కొన్ని సార్లు చర్మంపై ఎర్రని దద్దుర్లు కూడా వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడటం చాలా ప్రమాదకరం. వెంటనే డాక్టర్ ను కలిసి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అలాగే ఈ జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూను నివారించవచ్చు.
- ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోండి. పాత టైర్లు, కుండీలు, బకెట్లు, కూలర్ లలో నీరు లేకుండా చూసుకోవాలి.
- రాత్రి పడుకునేటప్పుడు మోస్కిటో నెట్ వాడటం, దోమల రిపెల్లెంట్లు ఉపయోగించడం మంచిది.
- ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచుకునే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఉండే ఆహారం తినాలి.
- మరిగించిన నీళ్లు, హెర్బల్ కషాయాలు, పండ్ల రసాలు తాగాలి. ఇవి డీహైడ్రేషన్ను నివారిస్తాయి.
- పిల్లలు, వృద్ధులు, షుగర్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
డెంగ్యూ గురించి అపోహలు
చాలా మంది డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని అనుకుంటారు. అది తప్పు. ఇది కేవలం దోమ కాటు ద్వారానే వస్తుంది. అలాగే యాంటీబయోటిక్స్తో డెంగ్యూ నయమవుతుందని భావించడం కూడా పొరపాటే. డెంగ్యూకు ప్రత్యేక యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ ఉండదు. డాక్టర్ సలహా ప్రకారం విశ్రాంతి తీసుకుని సరైన చికిత్స చేయించుకుంటేనే ఉపశమనం లభిస్తుంది.
వర్షాకాలం ఎంత అందంగా ఉన్నా.. మనం అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని కలవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.




