రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా!
గురుగ్రామ్కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి ఏటా రూ.40 లక్షలు సంపాదిస్తూ, సొంత ఇల్లు, విలాసవంతమైన కారు ఉన్నప్పటికీ తాను పేదవాడిననే భావనతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇతరులతో నిరంతరం పోల్చుకోవడం, సోషల్ మీడియా ప్రభావం, పెరుగుతున్న అంచనాలు ఆధునిక పేదరికానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డబ్బుకంటే జీవిత సంతృప్తి ముఖ్యమని సూచిస్తున్నారు.
సమాజంలో సక్సెస్, సంపాదనకు అర్థాలు వేగంగా మారిపోతున్నాయి. గురుగ్రామ్లో 34 ఏళ్ల ఓ వ్యక్తి ఏటా రూ.40 లక్షల జీతం సంపాదిస్తూ, సొంత 2 బీహెచ్ కే ఫ్లాట్లో నివసిస్తూ, విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నప్పటికీ.. తాను చాలా పేదవాడినని భావిస్తున్నాడట. ఆందోళనతో రాత్రుళ్లు నిద్ర కూడా పట్టడం లేదని తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ విషయాన్ని ఎవర్హోప్ ఆంకాలజీ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ సన్నీ గార్గ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసారు. వైద్య సలహా కోసం వచ్చిన ఆ వ్యక్తి, తను చాలా పేదవాడినని అనుకుంటున్నాననీ ఆ కారణంగా తనకు రాత్రుళ్లు నిద్ర కూడా పట్టడం లేదని తన ఆవేదనను వెళ్లగక్కాడు. డాక్టర్ గార్గ్ ఈ అనుభవాన్ని వీడియోలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్గా మారింది. గణాంకాల ప్రకారం చూస్తే, ఆ వ్యక్తి జీతం భారతదేశంలోని టాప్ 1% సంపాదనపరుల జాబితాలో ఉంటుంది. అయితే, తనకంటే చిన్నవయసులోనే స్టార్టప్లు స్థాపించి కోట్లకు పడగలెత్తిన యువ పారిశ్రామికవేత్తలతో తనను తాను పోల్చుకున్నాడు. అదే అతడిలో ‘ఆధునిక పేదరికం’ అనే భావనను నింపుతోందని డాక్టర్ గార్గ్ విశ్లేషించారు. ఆదాయం పెరిగినప్పటికీ, అంచనాలు అంతకంటే వేగంగా పెరగడమే ఈ అసంతృప్తికి కారణమని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గార్గ్ ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగారు: “మీరు సంపాదించింది మీకు సరిపోతుందని ఎప్పుడైనా భావించారా?”, “మీరు సంపాదిస్తున్నది ఎవరి కోసం?”, “మీ జీవితంలో డబ్బుతో సంబంధం లేకుండా మీరు చేసే పని ఏదైనా ఉందా?”. ఈ ప్రశ్నలు డబ్బుకు అతీతంగా సంతృప్తి, జీవిత పరమార్థం వంటి అంశాలపై ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ఇది కేవలం ఒక్కరి సమస్య కాదని, గురుగ్రామ్ వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు పొందుతున్న అనేకమంది టెకీలు ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇతరుల విలాసవంతమైన జీవితాలను చూసి, తమ సంపాదన సరిపోవడం లేదనే భావనకు లోనవుతున్నారు. ఖరీదైన జీవనశైలి, ఇంటి ఈఎంఐలు, పిల్లల చదువుల ఖర్చులతో అధిక జీతాలు పొందుతున్నప్పటికీ పొదుపు చేయలేకపోతున్నామని చాలామంది వాపోతున్నారు. డబ్బు భౌతిక అవసరాలను తీర్చగలదు కానీ, గుర్తింపు, సంతృప్తిని ఇవ్వలేదన్నారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ గార్గ్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే

