Health Tips: బ్లడ్ షుగర్ కంట్రోల్కు కొత్త ట్రిక్! గంటల కొద్దీ కూర్చునే వారికి బెస్ట్ మెడిసిన్
రోజుకు ఒక్కసారి వ్యాయామం కంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ నడవాలని మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు కూడా చెబుతుంటారు.

తాజాగా వెలువడిన ఒక పరిశోధన మన పాత నమ్మకాలను సవాలు చేస్తోంది. రోజంతా కూర్చుని పని చేసే వారికి కేవలం ఒక్క అరగంట నడక కంటే.. మధ్య మధ్యలో చేసే ఒక చిన్న కదలిక అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఏడు ఎనిమిది గంటల పాటు కుర్చీకే పరిమితం అయ్యేవారు తమ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి జిమ్కు వెళ్లాల్సిన పనిలేదు, కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సెకన్ల పాటు చేసే ఆ వ్యాయామం మీ మెటబాలిజంను, మెదడు ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంతకీ నడక కంటే శక్తివంతమైన ఆ వ్యాయామం ఏంటి? నిపుణులు సూచిస్తున్న ఆ ‘ఎక్సర్సైజ్ స్నాక్స్’ రహస్యం ఏంటో .
స్క్వాట్స్ ఎందుకు..
న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత, ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ ఫిజీషియన్ డాక్టర్ ఆస్టిన్ పెర్ల్ముట్టర్ తాజాగా ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అధిక బరువు ఉన్న పురుషులపై జరిపిన ఈ పరిశోధనలో.. రోజులో ఒకసారి సుదీర్ఘంగా నడవడం కంటే, రోజంతా చిన్న చిన్న విరామాలలో బాడీ వెయిట్ స్క్వాట్స్(గుంజీలు) చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా మెరుగ్గా అదుపులోకి వచ్చాయని తేలింది. ముఖ్యంగా గ్లూకోజ్ స్పైక్స్ పెరగకుండా నిరోధించడంలో స్క్వాట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు.
ఈ అధ్యయనం కోసం పాల్గొన్న వ్యక్తులను నాలుగు గ్రూపులుగా విభజించారు. సుమారు 8.5 గంటల పాటు వారు కూర్చుని ఉన్న సమయంలో.. ఒక గ్రూపు వారు అసలు కదలలేదు. రెండో గ్రూపు వారు ఒకేసారి 30 నిమిషాల పాటు నడిచారు. మూడో గ్రూపు వారు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాల పాటు నడిచారు. ఇక నాలుగో గ్రూపు వారు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కేవలం పది స్క్వాట్స్ మాత్రమే చేశారు. ఈ నాలుగు గ్రూపుల రక్త నమూనాలను పరిశీలించగా.. రోజంతా ఒకేసారి నడిచిన వారి కంటే, మధ్య మధ్యలో స్క్వాట్స్ చేసిన వారిలో చక్కెర స్థాయిలు అత్యంత సమర్థవంతంగా అదుపులో ఉన్నట్లు వెల్లడైంది.
కండరాల ప్రభావం..
స్క్వాట్స్ వల్ల రక్తంలో చక్కెర ఎందుకు తగ్గుతుందనే దానికి డాక్టర్ పెర్ల్ముట్టర్ ఒక సైంటిఫిక్ కారణాన్ని వివరించారు. మన శరీరంలోని అతిపెద్ద కండరాలైన గ్లూటియస్ మాక్సిమస్ క్వాడ్రిసెప్స్ స్క్వాట్స్ చేసినప్పుడు ఉత్తేజితం అవుతాయి. ఈ పెద్ద కండరాలు రక్తంలోని గ్లూకోజ్ను ఇంధనంగా వేగంగా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఒకేసారి గంటల కొద్దీ వ్యాయామం చేయడం కంటే, ఇలా కండరాలకు తరచుగా పని చెప్పడం వల్ల మెటబాలిక్ రేటు మెరుగుపడుతుంది.
రోజంతా కదలకుండా కూర్చునే వారికి ఈ ‘ఎక్సర్సైజ్ స్నాక్స్’ ఒక వరం లాంటివి. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కేవలం పది స్క్వాట్స్ చేయడం లేదా కాసేపు నడవడం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడటమే కాకుండా, అది మెదడు ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మెటబాలిజం మరియు మెదడు ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆఫీసుల్లో పని చేసే వారు లేదా ఇంట్లో ఎక్కువ సమయం కూర్చునే వారు ఈ చిన్న మార్పును అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నడక అనేది ఎప్పటికీ మంచి వ్యాయామమే, కానీ కూర్చుని పని చేసే వారు మాత్రం మధ్య మధ్యలో లేచి కొన్ని స్క్వాట్స్ చేయడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతారు. జీవనశైలిలో పెద్ద మార్పులు చేయకుండానే కేవలం పది సెకన్ల పాటు చేసే ఈ పని మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
