SP Balu Death Anniversary: పాటగా బతకనా మీ అందరి నోట అంటూ.. దివికేగిన ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి నేడు..

SP Balu Death Anniversary: విశ్వం మెచ్చిన "తెలుగు గాయకులు" కీ.శే.ఎస్పీ బాలసుబ్రమణ్యం.. నేటితో దివికేగి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గంగంధర్వుడిని జ్ఞాపకం..

SP Balu Death Anniversary: పాటగా బతకనా మీ అందరి నోట అంటూ.. దివికేగిన ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి నేడు..
Sp Balu
Follow us

|

Updated on: Sep 25, 2021 | 4:20 PM

SP Balu Death Anniversary: విశ్వం మెచ్చిన “తెలుగు గాయకులు” ఎస్పీ బాలసుబ్రమణ్యం.. నేటితో దివికేగి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గంగంధర్వుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కళాకారులకు మరణం ఎక్కడ.. మీరు బౌతికంగా మా మధ్యలేదు.. మీపాటలు, మీరు నటించిన సినిమాలతో మా మధ్య సజీవంగా .. మా మాది గదిలో ఓ అపురూపజ్ఞాకంగా చిరంజీవిలా చిరకాలం ఉంటారు. అవును సినిమా పాటకు పర్యాయ పదం బాలు. కోట్లాది మందికి ఆత్మానందాన్ని పంచిన అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మొదలు అనేక భాషా నటులకు, హీరోలకు వేల పాటలు పాడి..  తన గొంతులో వాళ్ళ పాత్రలను పలికించి, వారి విజయ సోపానంలో కీలక భూమిక పోషించిన నేపథ్య గాయక శిఖరం ఎస్పీబి.  తన గాత్రంతో ప్రేక్షకులకు అమృతాన్ని పంచాడు. ఇందరికి ఆత్మానందాన్ని పంచిన బాలుకి ప్రధమ వర్ధంతి సందర్భంగా టీవీ 9 వెబ్ సైట్ నివాళులపిస్తుంది..

అవును ఎస్పీ బాలు దివి నుంచి భువికి.. వచ్చిన గానగంధర్వుడు.. తన గాత్రంతో వీనుల విందుగా పాటలను ఆలపించి..తన పని పూర్తి చేసుకుని సంగీత ప్రియులకు, తన అభిమానులకు కన్నీరు మిగులుస్తూ.. మళ్ళీ భువి నుంచి దివికేగిన మహనీయులు. ఆయన గొంతులో ఓంకార నాదాలు సంధానమై నిలిచాయి. ఆయన పాటలతో శ్రోతలకు పంచామృతం పంచారు. ఆయన గానం స్వరరాగ నాదామృతం. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. బాలు గొంతులో ఏదో మాయ ఉంది.. హీరో, విలన్, కమెడియన్స్ ఎవరికైనా వారికి తగిన విధంగా పడే నేర్పు ఆయన సొంతం.. ఎస్పీ బాలు గొంతులో భక్తి రసం, విరహం, విషాదం, ప్రేమ, మాస్, క్లాస్ అంటే తెద్దా లేకుండా అలవోకగా జాలువారుతుంది. పాటలోని మాటలను …గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రమణ్యం. అందుకనే ఎస్పీబాలసుబ్రమణ్యం ఎప్పటికీ గుర్తుండిపోతారు. సామాన్య గాయకుడిగా వెండి తెరపై అడుగు పెట్టి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆయన సొంతం. ఒక్క నేపధ్య గాయకుడి కాదు.. నటుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాతకూడా తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఎస్పీబాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.  అందుకనే ఆయన్ని ముద్దుగా ఎస్పీబీ అని, బాలు అని పిలుచుకుంటారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. బాలుకి ఇద్దరు సోదరులు, నలుగురు చెల్లెలు. అందులో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత గాయకులుగా సుపరిచితులు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సావిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం. ఇద్దరూ వెండి తెరపై గాయకులుగా అడుగు పెట్టారు. తండ్రిని మించిన స్థాయికి చేరుకోకుండా తమదైన శైలిలో పాటలతో అలరించారు. అంతేకాదు.. బాలు కూతురు, కొడుకు ఇద్దరికీ సంతానం కవలలు కావడం విశేషం.

బాలు తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు. పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించారు. తండ్రిని చూస్తూ పెరిగిన బాలుకి చిన్నతనం నుంచి సంగీతంపై ఆసక్తి కలిగింది.  దీంతో బాలు ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ప్రాథమిక విద్య నగరి లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశారు. శ్రీకాళ హస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. అయితే ఎస్పీబీ చదువులోనే కాక, ఆటల్లో కూడా ఎప్పుడూ ఫస్ట్.. ఇక  శ్రీకాళహస్తిలో చదువుతున్న సమయంలో జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించారు. అదే సమయంలో రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు  బాలసుబ్రమణ్యం తో ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో పాత్రలను ఇచ్చారు.  తర్వాత  పియుసి చదువుతున్న సమయంలో మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.

అనంతపురంలో ఇంజనీరింగులో సీటుని వదులుకున్న బాలు మద్రాసు ప్రయాణమయ్యారు. తండ్రి కోరిక బాలు ఇంజనీర్ కావడం దీంతో చెన్నై లో ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరారు.  ఇంజనీర్ చదువుతున్న సమయంలోనే బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

ఓ వైపు నేపధ్య గాయకుడిగా పాటలు పడుతూనే.. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, డబ్బింగ్ హోస్ట్‌గా , నటుడిగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు బాలు.  మన్మధలీలై చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు  పొందిన బాలు.. కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరణ్, సల్మాన్ ఖాన్ , కే భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, కార్తీక్, రఘువరన్ లాంటి ఎందరో ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు. ఇక 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పక్కింటి అమ్మాయి, ప్రేమ, వివాహ భోజనంబు, కళ్లు, చెన్నపట్నం చిన్నోడు, ప్రేమికుడు, గుణ, పవిత్రబంధం, మిథునం, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు. సంగీత నేపధ్యం ఉన్న షో పాడుతా తీయగా.. ఈ షోకి వ్యాఖ్యాతగా బాలు ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎంతోమంది యువ గాయనీగాయకులు వెండి తెరకు అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ పడమటి సంధ్యారాగం సినిమా ఎప్పటికీ సినీ ప్రేక్షకుడికి గుర్తింది పోతుంది.

40 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అరుదైన రికార్డ్  సృష్టించిన గాయకులూ బాలు.. తెలుగు వారు కావడం మనకందరికీ గర్వకారణం. వివిధ భాషల్లో పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సింగర్ గా , నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని  25 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు  అందుకున్నారు. పద్మశ్రీ , పద్మభూషణ్ ,పద్మ విభూషణ్,  డాక్టరేటు వంటి అనేక బిరుదులను అందుకున్న బాలు ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారిన పడ్డారు. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోలుకుని తిరిగి వస్తారని అందరూ ఎదురుచూస్తున్నా వేళ.. అంత్యమీ అలసితి సొలసితి అంటూ తన గళ కలశంలో ఆ సర్వేశ్వరుడుని ఎంతలా ఆర్థిగా వేడుకున్నారో.. ‘‘పాటగా బతకనా మీ అందరి నోట’’ అని సెలవు ఇచ్చి.. భువి నుంచి దివికేగారు గానగంధర్వుడు..

Also Read: Gold-Silver Price Today: మహిళలు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం ధరలు.. అదే బాటలో పయనిస్తున్న వెండి