అమ్మపై అలక.. కన్నడసీమలో సినిమా సెంటిమెంట్.. దర్శన్, సుమలత మధ్య కోల్డ్ వార్
కడుపున పుట్టిన బిడ్డకాకపోయినా మొన్నటిదాకా తనకు ఆమె అమ్మే. ఆ తల్లీకొడుకుల బంధం ఇండస్ట్రీ అంతా తెలుసు. అలాంటిది కొడుకెందుకో అమ్మమీద అలిగాడు. ఫేక్మదర్ అంటూ అతని సపోర్టర్స్ ఆమెను ఆడిపోసుకున్నారు. అయినా అవునన్నా కాదన్నా నువ్వు నాకు కొడుకువేరా అంటోందా అమ్మ.

కన్నడసీమలో సిన్మా సెంటిమెంట్ని మించిపోయింది ఆ సెలబ్రిటీస్ ఎమోషనల్ జర్నీ. ఆ ఇద్దరి మధ్యా ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. బహిరంగ వేదికలపైనే తను నా కొడుకని ఓపెన్గా చెప్పారామె. అతను కూడా ఆమె కనిపిస్తే చాలు.. పసిపిల్లాడిలా తన చేతుల్లో ఒదిగిపోతాడు. తను ఆమె పేగుతెంచుకు పుట్టకపోయి ఉండొచ్చు. ఆమె తనను నవమాసాలు మోసిన తల్లికాకపోయుండొచ్చు. కానీ ఆ ఇద్దరి మధ్యా తల్లీకొడుకులను మించిన అనుబంధమే ఇన్నేళ్లూ.
కన్నడ నటుడు దర్శన్ జీవితం అనుకోకుండా సంక్షోభంలో చిక్కుకుంది. అభిమాని హత్యకేసులో జైలుగోడలమధ్య మగ్గాల్సి వచ్చింది. కన్నకొడుకులాంటి దర్శన్కి ఇలా జరగడం తల్లికాని తల్లి సుమలతను ఎంతో కలచివేసింది. నటుడు దర్శన్ ఇన్స్టాగ్రామ్లో అందరినీ అన్ఫాలో చేశాడు. తల్లిలా చూసుకున్న సుమలతను కూడా అతను ఈ లిస్ట్లో చేర్చడంతో అసలేం జరిగిందన్న అనుమానాలు మొదలయ్యాయి. కొడుకు తనను అన్ఫాలో చేసినా అంతనెంతో ఆవేదనతో ఉన్నాడని అర్ధంచేసుకుంది ఆ తల్లి ప్రేమ. దర్శన్, సుమలతల బంధం చెడిపోయిందని అంతా అంటున్నారు. దీంతో ఈ విషయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు సుమలత. తన ఆఖరి శ్వాస వరకు దర్శన్ తన కొడుకేనన్నారు. నన్నొక్కదాన్నే కాదు దర్శన్ అందరినీ అన్ఫాలో చేశాడని గుర్తుచేశారామె. సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మానేస్తే.. రిలేషన్ షిప్ పాడవుతుందా అన్నది సుమలత క్వశ్చన్. ఇది విని నవ్వాలో, బాధపడాలో తెలీడం లేదన్నారు సుమలత.
దర్శన్ ఇన్స్టాలో అన్ఫాలో చేసినా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు సుమలత. నొప్పిలేకుండా ఎదగడం, మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే వారితో సంభాషించడం, చింతలు లేకుండా వర్తమానంలో ప్రశాంతంగా జీవించడం చాలా ముఖ్యం అంటూ పోస్ట్ చేశారు సుమలత అంబరీష్. ఇటీవల దర్శన్ పుట్టినరోజు సందర్భంగా సుమలత అతనికి విషెస్ చెబుతూ సాధన శిఖరాన్ని చేరే శక్తి నీలో ఉంది అని ట్వీట్ చేశారు. అయితే దర్శన్ ఫ్యాన్స్ కొందరు దీనిపై ఫేక్ మదర్ ఇండియా, ఊసరవల్లి అమ్మ అంటూ విమర్శలు గుప్పించారు.
సోషల్ మీడియాకు తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనన్నారు సుమలత. సోషల్ మీడియా ఉపయోగకరమైన సాధనం అంటూనే.. ఇది ప్రమాదకరమైన ఆయుధం కూడా అన్నది ఆమె అభిప్రాయం. దర్శన్ జైలు నుంచి విడుదలైన తర్వాత, సుమలత కుటుంబ సభ్యులెవరూ ఆయనను కలవలేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జైల్లో దర్శన్ను కలిసి పరామర్శించపోవడమే ఇద్దరి మధ్యా విభేదాలకు కారణమా అన్న అనుమానాలొస్తున్నాయి. సత్యాన్ని వక్రీకరించిన, పశ్చాత్తాపం లేకుండా మరొకరిని బాధపెట్టిన వ్యక్తికి ఉత్తమ నటుడు ఆస్కార్ అవార్డు వస్తుందని సుమలత పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది.
అయితే తానెవరినీ టార్గెట్ చేసి పోస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు సుమలత. తన పోస్ట్కి దర్శన్కి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన జీవితంలో ప్రతికూల ఆలోచనలకు తావు లేదన్నారు సుమలత. తన గురించి చెడుగా మాట్లాడిన వారికి కూడా మంచే జరగాలని కోరుకుంటానని, దర్శన్ లేకుండా తమ ఇంట్లో ఏ కార్యక్రమం జరగదన్నారు. అన్ఫాలో చేశాడే తప్ప సుమలతకు వ్యతిరేకంగా దర్శన్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదంటున్నారు ఆయన ఆప్తమిత్రులు కూడా. ఊహాగానాలు పెరగటంతో సుమలత స్వయంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. తుదిశ్వాసదాకా దర్శన్ తన కొడుకేనని ఎమోషనల్గా స్పందించారు.
ఆ ఇద్దరికీ ఆప్తుడైన శశికుమార్ త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెప్పారు. దర్శన్- సుమలతది ఎప్పటినుంచో తల్లీ కొడుకుల అనుబంధం అన్నారాయన. విసుగుతోనే దర్శన్ ఇలా స్పందించి ఉండొచ్చన్నారు. ఈ వ్యవహారం త్వరలోనే సుఖాంతమవుతుందంటున్నారు శశికుమార్. ఎప్పటికీ దర్శన తన కొడుకునని, తల్లీకొడుకుల మధ్య వివాదాలు సృష్టించవద్దన్న సుమలత వివరణతో.. ఈ చర్చకు ఫుల్స్టాప్ పడుతుందో.. లేక మరింత చర్చ జరుగుతుందో చూడాలి.!