
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ తారాగణంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. కథానాయికలుగా దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని చిత్రయూనిట్ అనౌన్స్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఫిల్మ్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగిస్తోంది.
ఇప్పటికే మేకర్స్ రివీల్ చేసిన పోస్టర్ లో రెండు వేరు వేరు చేతులు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఆ రెండో చేయి కూడా ప్రభాస్ దే అంటున్నారు. ఈచిత్రంలో భూత, భవిష్యత్ కాలాల నుంచి కాన్సెప్ట్ ఉంటుందని అంటున్నారు. అంటే రెండు కాలమానాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రభాస్ పాత్రలే కావచ్చని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ఈనెల 21 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.