CM Revanth Reddy: సినీ కార్మికుల కోసం రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి..
సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ధరలు పెంచితే.. అందులో కార్మికులకు 20 శాతం వాటా ఉండాలని.. కార్మికుల ఆరోగ్య భద్రత చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతదేనని స్పష్టం చేశారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ కు సినీకార్మికులచే అభినందన సభ ఏర్పాటు చేశారు.

సినీ పరిశ్రమలో కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరలను పెంచుకోవాలని కోరుకుంటే..ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు లాభంలో 20 శాతం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు కేటాయించాలని షరతు విధించారు. ఈ షరతులను పాటిస్తేనే భవిష్యత్తులో టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తామని..అందుకు సంబంధించిన జీవోలో నిబంధనలను సడలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో జరిగిన సినీ కార్మిక సంఘాల అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ కార్మికులకు కలెక్షన్లలో వాటా ఇచ్చేందుకు ఒప్పుకుంటేనే టికెట్ల రేట్ల పెంపుకు ఆమోదం తెలియచేస్తామని ప్రకటించారు. టికెట్ రేట్లు పెరిగితే హీరోకు, నిర్మాతకు డబ్బులు వస్తాయని కానీ కార్మికులకు ఏమీ దక్కదని.. అందుకే ఇకపై టికెట్ రేట్లు పెంచే జీవో ఇవ్వాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇటీవల రిలీజైన OG సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే టికెట్ రేట్లు పెంచడం సామాన్యులకు భారమంటూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు. కోర్టు నిర్ణయం మేరకు ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని స్పష్టం చేసింది ప్రభుత్వం. అటు కోర్టు తీర్పు..ఇటు ప్రభుత్వ స్టేట్మెంట్తో భవిష్యత్లో తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం లేదన్న ఆందోళన సినీ వర్గాల్లో మొదలైంది. అయితే సినీ కార్మికుల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ టికెట్ రేట్ల ప్రస్తావన తీసుకు రావడం అందులో కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలనడం ఆసక్తి రేపుతోంది. కార్మికులకు ఇరవై శాతం వాటా ఇస్తే రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇస్తామని ప్రభుత్వం చట్టం చేస్తే కోర్టుల్లో కూడా సమస్య ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ ప్రతిపాదన ఎలా కార్యరూపంలోకి వస్తుందోనన్న ఆసక్తి సినీవర్గాల్లో నెలకుంది.
సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని అన్నారు. ప్రభుత్వం చేయగలిగిన పనులు చేస్తామని.. సినిమా టికెట్స్ పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని అన్నారు. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
