K.J.Yesudas: దైవదత్తమైన జేసుదాసు స్వరం వింటే చాలు శ్రుతిలయలు మురిసిపోతాయి, స్వరజతులు సరాగాలు పోతాయి

ఆయన గళంలో అంతు పట్టని మార్మికత. ఎవరికీ అందని ప్రత్యేకత. దైవదత్తమైన ఆ స్వరం భక్తి సంగీతానికి భావోద్వేగపు పరిమళాలను అద్దింది.

K.J.Yesudas: దైవదత్తమైన జేసుదాసు స్వరం వింటే చాలు శ్రుతిలయలు మురిసిపోతాయి, స్వరజతులు సరాగాలు పోతాయి
Follow us

|

Updated on: Jan 10, 2021 | 11:11 AM

ఆయన గళంలో అంతు పట్టని మార్మికత. ఎవరికీ అందని ప్రత్యేకత. దైవదత్తమైన ఆ స్వరం భక్తి సంగీతానికి భావోద్వేగపు పరిమళాలను అద్దింది. లలిత సంగీతాన్ని సుధారసం చేసింది. సంప్రదాయ సంగీతాన్ని వాగ్గేయకారుల సరసన నిలిపింది. పాశ్చాత్య సంగీతానికి సరికొత్త సింగారింపు తెచ్చింది. ఆరు దశాబ్దాలకు పైగా ఆ స్వర రాగ గంగ ప్రవహిస్తూనే వుంది.. ఆ అద్భుతమైన స్వరం జేసుదాసుది.

జేసుదాసు…ఎందుకో ఈ పేరు వినగానే శ్రుతి లయలు మురిసిపోతాయి. స్వరజతులు సరాగాలు పోతాయి. వాయిద్యాలు ఆ గళంతో పోటీ పడగలమో లేదోనని సందేహపడతాయి. రాగం తీసే కోయిల కూడా ఆ కంఠం విని చప్పున పాటడం ఆపేస్తుంది. అటు సినీ సంగీతాన్ని, ఇటు కర్ణాటక సంగీతాన్ని అసమాన రీతిలో మేళవించిన సంగీత స్రష్ట ఆయన! మనందరికి ఆత్మీయ గాయకుడైన జేసుదాసు పూర్తి పేరు కట్టశేరి జోసెఫ్‌ జేసుదాసు.. దాసేటన్‌ అని ప్రేమపూరిత వాత్సల్యంతో అందరూ పిల్చుకునే జేసుదాసు బాల్యం కష్టాలను భరించడం ఎలాగో నేర్పింది. యవ్వనం అవమానాలను హరాయించడం ఎలాగో చెప్పింది. అవహేళనలను దిగమింగుకోవడాన్ని నేర్పింది. పాటే ప్రాణంగా భావించిన ఆయనకు ఆరంభంలో తిరస్కారాలు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకున్నారాయన! కొచ్చిలోని ఓ సనాతన క్యాథలిక్‌ కుటుంబంలో 1940, జనవరి పదిన పుట్టారు జేసుదాసు. తండ్రి జోసెఫ్‌ మంచి గాయకుడు. రంగస్థల నటుడు. అంతకు మించి కళారాధకుడు. కానీ ఆయన కళను నమ్ముకున్నాడే తప్ప అమ్ముకోలేదు. సరస్వతి కటాక్షానికేం బోలెడంత వుంది. లక్ష్మీ కటాక్షమే కరువైంది. డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో చిన్నప్పుడే జేసుదాసు తెలుసుకున్నారు. అయినా సంగీతాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. సంగీత సరస్వతిని ఏనాడూ తిట్టుకోలేదు. ఆ కళను అమితంగా ప్రేమించారు. నాన్న ప్రభావమో ఏమో, వారసత్వంగా అబ్బిన కళో తెలియదు కానీ-జేసుదాసు చిన్నప్పట్నుంచే పాటపై మనసు పారేసుకున్నారు. ఆయనకు తొలి గురువు తండ్రే. ఆయన తర్ఫీదులో గాత్రానికి మెరుగులు దిద్దుకున్నారు. చిన్నప్పుడు పాటల పోటీల్లో జేసుదాసే ఫస్ట్‌. జేసుదాసు పాల్గొంటున్నారంటే మిగతా వారు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందంతే. స్కూల్‌ అయిపోయింది. ప్రీ యూనివర్సిటీ స్టడీస్‌ కూడా అయిపోయాయి. చదువు కంటే సంగీతంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు జేసుదాసు. రాష్ర్ట స్థాయిలో జరిగిన కర్ణాటక గాత్ర సంగీతంలో జేసుదాసు ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు. అప్పుడాయన వయసు పదిహేడేళ్లే. కొడుకు ఇష్టా ఇష్టాలను తండ్రి జోసెఫ్‌ గమనించారు. జేసుదాసును తిరుపుణిత్తారయనిలోని సంగీత కళాశాలలో చేర్పించారు. క్రైస్తవుడేమిటి ? సంగీతం నేర్చుకోవడమేమిటి? అని చెవులు కొరుక్కున్నారు. జేసుదాసు ఇవేవీ పట్టించుకోలేదు. తన లక్ష్యసాధనలోనే పూర్తి సమయం వెచ్చించారు. కసి-పట్టుదల ఆయనను కాలేజి ఫస్ట్‌ని చేశాయి. ఆ తర్వాత స్వాతి తిరునాల్‌ మ్యూజిక్‌ కాలేజీలో చేరి శెమ్మంగుడి శ్రీనివాస్‌ అయ్యర్‌ దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత త్రివేండ్రంలోని సంగీత అకాడమీలో చేరారు. ఈ మధ్యలో చెంబై వైద్యనాథ భాగవతార్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు. జేసుదాసు స్వర మాధుర్యానికి, గాత్ర వైవిధ్యానికి భాగవతార్‌ ముచ్చటపడ్డారు. కొంతకాలానికే జేసుదాసు ఆయనకు ప్రియ శిష్యుడయ్యారు.ఆ గంధర్వగాయకుడికి కాలం మరిన్ని విషమపరీక్షలను పెట్టింది. సంగీత అకాడమీలో చేరిన తర్వాత తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. వెంటనే ఇంటికొచ్చేశారు. పూట గడవడానికి కూడా డబ్బుల్లేని దుర్భర పరిస్థితి. ఇంటిని నెట్టుకురావడానికి చిన్నా చితక పనులు చేశారు. ఆ సంపాదనతో తండ్రికి వైద్యం చేయించారు. అయినా ఫలితం దక్కలేదు. ఆస్పత్రిలోనే తండ్రి కన్నమూశారు. ఎనిమిది వందల రూపాయలు కడితే కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వీల్లేదంది ఆస్పత్రి యాజమాన్యం. ఇంట్లో వున్న వస్తువును తాకట్టు పెట్టి తండ్రి భౌతికకాయాన్ని ఇంటికి తెచ్చుకోవాల్సి వచ్చింది. తండ్రి మరణించడంతో ఇంటికి తనే పెద్దదిక్కయ్యారు. సంగీత అకాడమీలో సంగీతం అభ్యసించాలన్న ఆలోచనను బలవంతంగా మనసులోంచి తుడిపేసుకున్నారు. ఎంత కష్టపడ్డా కడుపు నిండా తిండిదొరికేది కాదు. సాయం కోసం ఒకరిని చేయిచాచి అడిగే మనస్తత్వం కాదు జేసుదాసుది! ఆత్మాభిమానం అడ్డుపడేది. గాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. వెంటనే మద్రాసుకు బయలుదేరారు. మద్రాసులో అయితే అడుగుపెట్టారు కానీ ఎటు పోవాలో, ఎవరిని అడగాలో తెలియని అయోమయస్థితి. జేబులో వున్నవి పదహారు రూపాయలే! అవకాశాల కోసం సంగీత దర్శకుల గడపలన్నీ ఎక్కారు. కొందరు చూద్దాం చేద్దాం అనేవారు. మరికొందరు నీ గొంతు బాగోలేదని మొహం మీదే చెప్పేవారు. డబ్బుల్లేక మంచినీళ్లతో కడుపు నింపుకున్న స్థితిని కూడా జేసుదాసు అనుభవించారు. కాసిన్ని డబ్బుల కోసం స్టేజీ పాటలు పాడారు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు వస్తేగా! పేరు మార్చుకుంటే అవకాశాలొస్తాయేమో, ప్రయత్నించమన్నారు స్నేహితులు. ఈ సలహాను జేసుదాసు పెద్దగా పట్టించుకోలేదు. కారణం-చిన్నప్పుడు తండ్రి అన్న మాటలు వెంటాడుతుండటమే! మనిషికి పేరు ముఖ్యమే కానీ అది మనిషికంటే గొప్పదేం కాదు. వ్యక్తి అభివృద్ధికి పేరేప్పుడూ అడ్డంకి కాదు. మంచి పేరు పెట్టుకున్నవాళ్లంతా మంచిగా వుంటారన్న గ్యారంటీ లేదు. ప్రతిభను నమ్ముకో. నమ్మకం పెంచుకో. లక్ష్యాన్ని చేరువ చేసేవి ఇవే! ఈ హితోక్తి జేసుదాసు మనసులో బలంగా నాటుకుపోయింది.. ఇప్పుడు జేసుదాసు పేరే సంగీతానికి పర్యాయపదమైంది.కష్టపడ్డారు. తీవ్రంగా కష్టపడ్డారు. తనకు తాను పరీక్షలు పెట్టుకున్నారు. ప్రతీ సంగీత దర్శకుడి దగ్గర తన స్వరాన్ని వినిపించారు. అదే సమయంలో మలయాళ చిత్ర దర్శకుడు కె.ఎన్‌.ఆంథోనీ కాల్‌పాడుక్కల్‌ అనే సినిమా తీస్తున్నారు. దానికి ఎం.బి.శ్రీనివాసన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆ సినిమాలో ఓ పాటను ఓ గాయకుడితో పాడించాలనుకున్నారు. కానీ అతడు, ఈ పాటను నాకంటే జేసుదాసే బాగా పాడతాడు అని చెప్పి ,వాళ్లను ఒప్పించి ఆ అవకాశాన్ని జేసుదాసుకు ఇప్పించారు. అలా 1961, నవంబర్‌ 14న జేసుదాసు తొలి పాట రికార్డు అయింది. మాధుర్యంతో కూడిన వైవిధ్యభరితమైన జేసుదాసు కంఠం విని సంగీత దర్శకులు ఆశ్చర్యపోయారు. ఇంత మంచి స్వరాన్ని కాదనుకున్నందుకు తమకు తాము నిందించుకున్నారు. జేసుదాసు స్వరం మలయాళికి ఇష్టంగా మారింది. అలనాటి సూపర్‌స్టార్‌ ప్రేమ్‌నజీర్‌ దగ్గర్నుంచి ఇప్పటి సూపర్‌స్టార్లు మమ్ముట్టి..మోహన్‌లాల్‌ మీదుగా వర్ధమాన నటుల వరకు ఆయన గాత్రదానం కొనసాగుతూ వస్తోంది. ఆ స్వరంలో రవ్వంతైనా మార్పు కూడా లేదు! అదే మాధుర్యం, అదే గాంధర్వ స్వరం!మలయాళం నుంచి తమిళంలోకి, అక్కడ్నుంచి తెలుగులోకి జేసుదాసు స్వరం ప్రవహించింది. 1965లో వచ్చిన బంగారు తిమ్మరాజు సినిమాతో జేసుదాసు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఏడో దశకంలో జేసుదాసు తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. మేరిమాత అనే డబ్బింగ్‌ సినిమాలో ఆయన పాడిన ‘సాగరతీర సమీపాన’ అన్న పాట జనహృదయాల్లో చొచ్చుకుపోయింది. ఆ తర్వాత ప్రేమపక్షులు, శ్రీకృష్ణసత్య వంటి సినిమాల్లో పాడినా జేసుదాసును తెలుగులో మరింత దగ్గర చేసింది మాత్రం అంతులేనికథలోని దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అన్న పాటే! ఇళయరాజా తొలి తెలుగు చిత్రం భద్రకాళిలో జేసుదాసు పాడిన చిన్ని చిన్ని కన్నయ్య పాట ఇప్పటికీ ఎక్కడోచోట వినిపిస్తూనే వుంటుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎన్నో అపూర్వమైన పాటలను తెలుగువారికి అందించారాయన. 1984లో వచ్చిన మేఘసందేశంలో ఆయన పాడిన పాటలు జాతీయ స్థాయిలో బహుమతిని తెచ్చిపెట్టాయి.జేసుదాసు గళాన్ని కృష్ణంరాజు, మోహన్‌బాబులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా మోహన్‌బాబు సినిమాల్లో జేసుదాసు పాట తప్పనిసరి అయింది. మోహన్‌బాబుకు జేసుదాసు పాడిన పాటలన్నీ సూపర్‌హిట్టయ్యాయి.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. అక్కినేని నుంచి మొదలు పెడితే… కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ., వెంకటేశ్‌, నాగార్జున, చంద్రమోహన్‌, మురళీమోహన్ వంటి నటులకు కూడా జేసుదాసు ప్లేబ్యాక్‌ పాడారు. భక్తి గీతాలను ఎంత భావస్ఫోరకంగా పాడగలరో, విషాద గీతాలను కూడా అంతే వైవిధ్యంగా ఆలపించగలరు. అదే జేసుదాసు స్పెషాలిటి! కశ్మీరీ, అస్సామీ, కొంకణి తప్ప అన్ని భారతీయ భాషల్లోనూ జేసుదాసు స్వరం పల్లవించింది. ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, లాటిన్‌, రష్యన్‌, అరబిక్‌, మలయ భాషల్లో ఆయన స్వరం మధురిమలను అద్దింది. జేసుదాసు ప్రతిభ ఏడో దశకం ఆరంభానికే హిందీ చిత్ర రంగానికి పాకింది. జై జవాన్‌ జై కిసాన్‌ చిత్రంతో హిందీ సీమలో అడుగు పెట్టారు.. అయితే మొదట విడుదలైంది మాత్రం చోటిసి బాత్‌. రవీంద్రజైన్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిట్‌చోర్‌ జేసుదాసును ఉత్తరాది ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. జాతీయ అవార్డును అందించింది. చష్మేబద్దూర్‌, త్రిశూల్‌, బవ్రీ, ఆలాప్‌ ఇలా ఎన్నో సినిమాల్లో జనరంజకమైన పాటలను ఆయన పాడారు. కేవలం జేసుదాసు కోసమే పాటలను కంపోజ్‌ చేసిన సందర్భాలు కూడా వున్నాయి.. తెలుగులోలాగే హిందీలో కూడా ఆయన అగ్రనటులందరికీ గాత్రాన్ని అందించారు. అది ప్రణయగీతమైనా భక్తి గేయమైనా చిలిపిపాటైనా జేసుదాసు గాత్రంలో శాస్త్రీయ సంగీతపు ఛాయలు తొణికిసలాడుతుంటాయి. ఎంతటి సంక్లిష్టమైన పాటనైనా ఆయన అవలీలగా పాడేయగల సమర్థులు. ఆయన ఏ రాగంలో ఆలపించినా అది దేవరాగమవుతుంది. అది అన్ని భాషలనూ రసరమ్యంగా వినిపించే రసధుని అది. ఆ మధురస్వరం మరో వందేళ్లపాటు నిత్యనూతనంగా ఉండాలని, ఇంకెన్నో పాటలను అందించాలని కోరుకుంటూ హప్పీ బర్త్‌ డే టు జేసుదాస్‌ సార్‌!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..