‘అర్జున్రెడ్డి’ రీమేక్ ‘వర్మ’ చిత్రం రద్దు కావడంతో దర్శకుడు బాలా తీరు గురించే కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఇలా చిత్రాన్ని ఆపివేయడం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
‘‘ప్రొడ్యూసర్స్ తప్పుడు సమాచారాన్నిజనాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ సినిమాపై స్పందించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా నుంచి నేనే గత జనవరి 22వ తేదీన వైదొలిగా. ధ్రువ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నీ మాట్లాడలేకపోతున్నానని’’ పేర్కొన్నారు. దీంతో పాటు ఆయన ‘వర్మ’ నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్టైన్మెంట్, బాలాకు సంబంధించిన బీ స్టూడియోస్ పరస్పరం రాసుకున్న అగ్రిమెంట్ను కూడా విడుదల చేశారు. భవిష్యత్తులో ‘అర్జున్రెడ్డి’ రీమేక్ సమయంలో ప్రెస్మీటులో కానీ, ఇతరత్రా విషయాల్లో తన పేరును ఏమాత్రం వినియోగించకూడదని కూడా అందులో ప్రస్తావించారు బాలా.
దర్శకుడు ఎవరు?
‘అర్జున్రెడ్డి’ రీమేక్ను వెంటనే ఆరంభించే పనిలో పడింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రానికి గౌతంమేనన్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దద్శకుడు ఆల్ఫోన్స్పుత్రన్, బియాజ్ నంబియార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ధ్రువ్ హీరోగా నటిస్తున్నారనే విషయం ఖరారైంది. ధ్రువ్కు జోడీగా శ్రీదేవి కుమార్తె జాన్వి నటించనున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లోనే నిర్మాణ వర్గాల నుంచి ప్రకటన వెలువడే అవకాశముందని తెలిసింది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి