కోల్కతా పోర్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ సీనియర్ నాయకుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ పోటీ చేస్తున్నారు. కోల్కతా దక్షిణ లోక్సభ నియోజకవర్గంలో ఉండే ఈ ప్రాంతం నుంచి మూడోసారి హకీమ్ బరిలో ఉన్నారు. కోల్కతా మేయర్ పదవిలో ఉన్న హకీమ్.. 2011లో తొలిసారి ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు. దీనికి ముందు కాంగ్రెస్కు చెందిన అబ్దుల్ ఖలీక్ మొల్లా ఎమ్మెల్యేగా ఉండేవారు. ఈ సీటులో మొదటిసారి 1952 లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్కు చెందిన ఎంఎం అబ్దుల్లా విజయం సాధించారు. ఇప్పటివరకు ఈ సీటును కాంగ్రెస్ 8 సార్లు, వామపక్షాలు 6 సార్లు, టీఎంసీ రెండుసార్లు కైవసం చేసుకుంది. 2016 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఫిర్హాద్ హకీమ్కు మొత్తం 73 వేల 459 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ సింగ్కు 46 వేల 911 ఓట్లు రాగా.. బిజెపికి చెందిన అవధ్ కిషోర్ గుప్తాకు 11 వేల 700 ఓట్లు మాత్రమే వచ్చాయి. కోల్కతా పోర్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.