రంగారెడ్డి జిల్లాలో విషాదం.. పెళ్లైన నాలుగు నెలలకే కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా..!
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
police constable suicide: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాచారం మండల కేంద్ర శివారులో కానిస్టేబుల్ మల్లికార్జున సైదులు(25) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తిరుమలేశుని గుట్ట సమీపంలోని ఓ వెంచర్లో చెట్టుకు కానిస్టేబుల్ ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ జిల్లా దిండి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సైదులు మర్రిగూడెం పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి గత ఏడాది నవంబర్లో వివాహమైంది. అప్పటి నుంచి దంపతులు మర్రిగూడెంలోనే నివాసం ఉంటున్నారు. పెళ్లై నెలరోజుల పాటు వారి కాపురం ప్రశాంతంగా సాగింది. అంతలోనే భార్యభర్తల మధ్య తరచూ చిన్నపాటి గొడవలు మొదలయ్యాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన సైదులు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
అక్కడి నుంచి నేరుగా తిరుమలేశుని గుట్ట సమీపానికి వెళ్లిన సైదులు అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న యాచారం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.