ఇండోర్ శివార్లలో చిరుత దాడి, పోలీసు సహా ఐదుగురికి గాయాలు, పట్టలేని అటవీ సిబ్బంది
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ శివార్లలో ఓ చిరుత జనావాసాల్లోకి ప్రవేశించింది. ఆదమరచి ఉన్న ఓ కుటుంబంలో ముగ్గురిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ శివార్లలో ఓ చిరుత జనావాసాల్లోకి ప్రవేశించింది. ఆదమరచి ఉన్న ఓ కుటుంబంలో ముగ్గురిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఈ కుటుంబాన్ని రక్షించేందుకు పోలీసులు, కొందరు అటవీ సిబ్బంది కూడా వచ్చారు. అయితే వారిని ఇది నానా పరుగులు పెట్టించింది. ఓ పోలీసుపై ఎటాక్ చేయడంతో ఆయన భయంతో పరుగులు తీశాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనం షెడ్డు కింద దాక్కున్న చిరుతను చూసి స్థానికులు కూడా భయపడిపోయారు. వారి కేకలు, అరుపులకు చిరుత కూడా బెంబేలెత్తి అటూఇటూ పరుగులు పెట్టింది. అటవీ సిబ్బంది వద్ద ట్రాన్ క్వి లైజర్, వల ఉన్నప్పటికీ దాన్ని పట్టుకోలేకపోయారు. దాదాపు మూడు గంటలపాటు అది వారిని ముప్పుతిప్పలు పెట్టి పారిపోయింది. దగ్గరలోని అటవీ ప్రాంతం నుంచి ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో కూడా ఈ చిరుత జనావాసాల్లోకి ప్రవేశించడం, చివరకు మళ్ళీ అడవిలోకి వెళ్లడం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇప్పటికే ఇది రెండో సారి రావడం, బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అడవిలో ఆహారం లభించక క్రూర మృగాలు ఇలా జనావాసాల్లోకి రావడం పరిపాటి అని అటవీఅధికారులు అంటున్నారు. సాధారణంగా తాము వీటిని పట్టుకునేందుకు వలలు వగైరాలతో వస్తామని, అయితే సిబ్బంది చేతుల్లో ట్రాన్ క్వి లైజర్ గన్ చూడడంతో భయపడకపోగా అవి రెచ్చిపోతాయని వారన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, అస్సాం టీ గార్డెన్స్, ముంబై వంటి చోట్ల చిరుతలు పలు సందర్భాల్లో దాడులు చేశాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండు నెలల్లో 10 మంది వీటి దాడులకు బలయ్యారు. ఉత్తరాఖండ్ లో అతి కష్టం మీద ఓ చిరుతను చంపగలిగారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
Insomnia: నిద్రలేమితో బాధపడుతున్నారా..? డిప్రెషన్ బారిన పడకుండా ఈ పద్ధతులు పాటించండి..