బాబ్రీ మసీదు కూల్చివేత కేసు.. రేపే తుది తీర్పు
సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తుది తీర్పు ఇవ్వనుంది.
సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తుది తీర్పు ఇవ్వనుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈనెల 30వ తేదీన తుది తీర్పు వెలుబడనున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. సీబీఐకి చెందిన ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో రేపు లక్నోలో తీర్పును ఇవ్వనున్నది. ఈ తీర్పు అనంతరం పరిణామాలపై కేంద్ర హోం శాఖ సమీక్షించింది. శాంతి, భద్రతలపై సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, రెండు వర్గాల చెందిన వారు మతపరమైన విద్వేషాలు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా భద్రతను పెంచాలంటూ కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో నిందితులు దోషులుగా తేలుతారని కొన్ని ముస్లిం సంఘాలు భావిస్తున్నాయని, ఒకవేళ తీర్పు వారి పక్షం లేకుంటే దాడులు జరిగే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. ముఖ్యంగా దేశంలోని సున్నితంగా ఉండే జిల్లాల్లో భద్రతను పెంచాలని కేంద్రం ఆదేశాల్లో తెలిపింది.
1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో కర సేవకులు 16వ శతాబ్ధానికి చెందిన మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతిపై నేరపూరిత కుట్ర కింద ప్రత్యేక సీబీఐ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. కాగా, అద్వానీతో పాటు ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు 2001లో కొట్టివేసింది. దాన్ని 2010లో అలహాబాద్ కోర్టు సమర్థించింది. అయితే అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం ఓవర్రూల్ చేసింది. 2017లో అద్వానీతో పాటు ఇతరులపై నమోదు అయిన నేరపూరిత అభియోగాలను రిస్టోర్ చేయాలని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆ కేసులో ఆదేశించింది. దీంతో విచారణ జరిపిన సిబీఐ కోర్టు ఇరుపక్షాలకు చెందిన వాదోపవాదాలు నమోదు చేసింది. ఈనెల 30వ తేదీన అద్వానీతో పాటు పలువురు నేతలందరూ కోర్టుకు హాజరుకావాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును సెప్టెంబర్ 30న వెలువరించనుంది.