AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadepalli Gang-raped: తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక ఆధారాలు.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో వేట

తాడేపల్లి గ్యాంగ్‌రేప్‌ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం గుంటూరు జిల్లా పోలీసులు వేటను ముమ్మరం చేశారు.

Tadepalli Gang-raped: తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక ఆధారాలు.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో వేట
Balaraju Goud
|

Updated on: Jun 21, 2021 | 8:36 AM

Share

Tadepalli Gang-raped: తాడేపల్లి గ్యాంగ్‌రేప్‌ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం గుంటూరు జిల్లా పోలీసులు వేటను ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక బృందాలతో మృగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు సెల్‌ఫోన్‌, బంగారం వస్తువులు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఇవాళ మరిన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు.

తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద కృష్ణా నదిలో ప్రేమజంటపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జల్లెడపడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువభాగాన మహానాడు సమీపంలోని రైల్వే వంతెన కింద నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడి.. నాటుపడవపై విజయవాడవైపు వెళ్లినట్లు యువతి కాబోయేభర్త తెలిపారు. అప్పటికే చీకటి పడిపోవడంతో నిందితులను గుర్తించడం వారికి కష్టమైందని పోలీసులతో చెప్పారు.

యువతితోపాటు వచ్చిన యువకుడిని పోలీసులు వెంటతీసుకుని రెండు జిల్లాల్లో అనుమానితుల వద్దకు తీసుకువెళ్లి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు మూడు వేర్వేరుగా బృందాలుగా ఏర్పడి కృష్ణానది పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడవైపు కృష్ణానదిలో ముగ్గురు వ్యక్తులు పోలీసుల రాకను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. సదరు వ్యక్తులను ఎస్సైలు వెంటాడి పట్టుకుని ప్రశ్నించారు. వారిని బాధితునికి చూపడంతో వారు కాదని తెలపడంతో వదిలేశారు. అఘాయిత్యానికి పాల్పడింది బ్లేడుబ్యాచ్‌ లేదా గంజాయి సేవించేవారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

అసాంఘిక కార్యకలాపాలకు సీతానగరం రైల్వేట్రాక్‌ అడ్డగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 2 నెలలో వ్యవధిలో అక్కడ ఐదు నేరాలు జరగడం ఇందుకు కారణంగా మారింది. పోలీసుల నిఘా లేకపోవడంతో రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి, బ్లేడ్ బ్యాచ్ తిష్ట వేస్తూ దాడులకు సైతం తెగబడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో ఈ ముఠాలు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు వివరిస్తున్నారు.

Read Also…  Shamshabad Airport Drugs: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ సీజ్.. ఒకరి అరెస్ట్!