AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఐదు జిల్లాల్లో కోవిడ్ టెస్టులు! ఐసీఎంఆర్‌ అనుమతే తరువాయి

తెలంగాణలో కరోనా తీవ్ర రూపం ప్రదర్శిస్తోంది. వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. రోజుకు సగటున 500 నుంచి 700 కొత్త కేసులు నమోదవుతుండటంతో ఐసీయూల్లో వెంటిలేటర్‌ పడకలు దొరకని దుస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులను పెంచేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మరో ఐదు జిల్లాల్లో కోవిడ్ టెస్ట్ ల్యాబ్‌ల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.

మరో ఐదు జిల్లాల్లో కోవిడ్ టెస్టులు! ఐసీఎంఆర్‌ అనుమతే తరువాయి
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2020 | 5:08 PM

Share

తెలంగాణలో కరోనా తీవ్ర రూపం ప్రదర్శిస్తోంది. వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ సెంటర్లలోని ఐసోలేషన్‌ వార్డుల్లోని పడకలన్నీ పాజిటివ్‌ బాధితులతో నిండిపోవడం.. మరోవైపు రోజుకు సగటున 500 నుంచి 700 కొత్త కేసులు నమోదవుతుండటంతో ఐసీయూల్లో వెంటిలేటర్‌ పడకలు దొరకని దుస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మరో ఐదు జిల్లాల్లో కోవిడ్ టెస్టులు నిర్వహించడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు లేఖ రాసింది.

రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరగుతున్న క్రమంలో ముఖ్య మంత్రి కేసీఆర్..మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు బయటపడుతుండటంతో జిల్లాల్లో కొత్త ప్రయోగశాలల్లో పరీక్షలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా.. నిజామాబాద్, గద్వాల్, సూర్యాపేట, మెదక్, కరీంనగర్ జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో ఈ కొత్త ల్యాబ్‌లు పనిచేస్తాయి. కోవిడ్ -19 పరీక్షలు చేయడానికి ఈ ఐదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిసౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఈ మేరకు టెస్టులకు అవసరమైన కిట్లు, ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ సీఎం కేసీఆర్ ఐసీఎంఆర్‌కు విన్నవించారు. కేంద్రం అనుమతి రావటమే తరువాయి.

ఈ ఐదు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్‌లలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేశారు సంబంధిత అధికారులు. వచ్చే వారంలో ఇక్కడి కరోనా టెస్టులకు కేంద్రం అనుమతి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాల్లో కరోనా టెస్ట్ సదుపాయాలు అందుబాటులో ఉంటే 24 గంటల్లో ఫలితాలను పొందవచ్చని ఓ అధికారి తెలిపారు. జిల్లాల్లో పరీక్షా సదుపాయాలు లేనందున, నమూనాలను హైదరాబాద్‌కు పంపాల్సి వస్తుందని, దీంతో రిజల్ట్స్ రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం, తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19 కోసం 28 ల్యాబ్ పరీక్షా సౌకర్యాలు ఉన్నాయి. వీటిలో 18 ప్రైవేటు రంగంలో, మిగిలినవి ప్రభుత్వ సౌకర్యాలు. ఈ 28 ప్రయోగశాలలో, వరంగల్ మరియు ఆదిలాబాద్ అనే రెండు మాత్రమే జిల్లాల్లో పనిచేస్తుండగా, మిగతావన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిమితుల్లో పనిచేస్తున్నాయి.

Follow Us