రైళ్లు, విమాన సర్వీసుల పునరుధ్దరణపై ఇంకా సస్పెన్స్
మే నెల 3 తరువాత రైళ్లు, విమాన సర్వీసుల పునరుధ్ధరణపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కరోనాపై పోరులో సామాజిక దూరం ఇప్పటికీ ఓ పెను సమస్యగా మారినందున..లాక్ డౌన్ ముగిసిన అనంతరం..
మే నెల 3 తరువాత రైళ్లు, విమాన సర్వీసుల పునరుధ్ధరణపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కరోనాపై పోరులో సామాజిక దూరం ఇప్పటికీ ఓ పెను సమస్యగా మారినందున..లాక్ డౌన్ ముగిసిన అనంతరం మే 4 నుంచి ముఖ్యంగా విమాన సర్వీసులను పునరుధ్దరిస్తామని, బుకింగ్స్ ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించిన సంగతి విదితమే. కానీ… దేశంలో కరోనా జోరు అలాగే ఉందని, 15 వేలమందికి పైగా ఇన్ఫెక్షన్స్ సోకాయని, మృతుల సంఖ్య 500 కి పెరిగిందని ప్రభుత్వం అంటోంది. ఈ కారణాల దృష్ట్యా ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవద్దని, ప్రభుత్వం ప్రకటించాకే ఇందుకు పూనుకోవాలని కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. శనివారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో సమావేశమైన మంత్రుల బృందం.. తిరిగి విమానాలు, రైళ్ల ప్రారంభంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ఈ బృందం అభిప్రాయపడింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా.. ప్రస్తుతానికి దీనిపై ఏమీ చెప్పలేమన్నారు. ప్రతి రోజూ తాము పరిస్థితిని గమనిస్తున్నామని, ‘కొత్త పాఠాలు నేర్చుకుంటున్నామని’ ఆయన వ్యాఖ్యానించారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి కూడా నిన్న ఇదే విధంగా పేర్కొన్నారు.