2 నెలల్లో రూ. 6 లక్షల కోట్ల రుణాలుః నిర్మలా సీతారామన్
కరోనా కష్టాల నుంచి బయట పడడానికి 20 వేల లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు.
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అందులో భాగంగా గడిచిన రెండు నెలల్లో అనేక కంపెనీలకు దాదాపు రూ.6 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. సూక్ష్మ-చిన్న- మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయ, కార్పొరేట్ రంగాలలోని 46.47 లక్షల ఖాతాలకు రుణాలు మంజూరు అయ్యాయని చెప్పారు. మార్చి 1 నుంచి మే 8 వరకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ. 1.18 లక్షల కోట్లు పొందాయని ట్విట్టర్లో సీతారామన్ వెల్లడించారు.
ఇక తాజాగా మంగళవారం రాత్రి ప్రధాని మోదీ మరో భారీ ప్యాకేజీని ప్రకటించారు. కరోనా కష్టాల నుంచి బయట పడడానికి 20 వేల లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర్ అభియాన్ పేరిట మోదీ ప్రకటించిన ఈ ప్యాకేజీ వివరాలను మే 13 నుంచి అంటే…నేటి నుంచే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని మోదీ చెప్పారు. జాతి నుద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ ఆర్థిక ప్యాకేజీ దేశ పురోగమనానికి దోహదపడుతుందన్నారు. ప్రతి శ్రామికుడికీ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ మొత్తం దేశం జీడీపీలో పది శాతం అని చెప్పారు. పారిశ్రామిక రంగం పురోగమించడానికి ఇది దోహదపడుతుందన్నారు. కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఉపయోగపడుతుందన్నారు. అయితే, ఇప్పుడు మోదీ ప్రకటించిన ప్యాకేజీ పంపకాలు చేయనున్న సీతమ్మ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.