బియ్యంతో శానిటైజర్లు.. ఇది లీగల్ ప్రాసెస్ అంటున్న కేంద్రం
సెంట్రల్ గోడౌన్లలో పరిమితికి మించి ఎక్కువగా బియ్యం నిల్వలు ఉన్నాయని, ఈ బియ్యాన్ని ఈథనాల్ గా మార్చి దాన్ని చేతి శానిటైజర్ల తయారీలో వాడడం తప్పేమీ కాదని, అలాగే కాలుష్యాలను తగ్గించేందుకు పెట్రోలుకు ఈథనాల్ ని వాడవచ్ఛునని కేంద్రం స్పష్టం చేసింది.

సెంట్రల్ గోడౌన్లలో పరిమితికి మించి ఎక్కువగా బియ్యం నిల్వలు ఉన్నాయని, ఈ బియ్యాన్ని ఈథనాల్ గా మార్చి దాన్ని చేతి శానిటైజర్ల తయారీలో వాడడం తప్పేమీ కాదని, అలాగే కాలుష్యాలను తగ్గించేందుకు పెట్రోలుకు ఈథనాల్ ని వాడవచ్ఛునని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ఖండిస్తూ.. ఇది లీగల్ ప్రాసెస్ అని కూడా వివరించింది. ప్రస్తుతం గోదాముల్లో బియ్యం నిల్వలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రాష్ట్రాలకు బియ్యాన్ని ఇంకా ఎక్కువగా పంపామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో చేతి శానిటైజర్లు కూడా ఎంతో ముఖ్యమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈథనాల్ ఉత్పత్తిని పెంచడం వల్ల శానిటైజర్ల తయారీ ఖర్చు తగ్గుతుందని కూడా తెలిపాయి. లాక్ డౌన్ కారణంగా పేదలు ఆకలితో అలమటిస్తున్న వేళ వారికి చెందిన బియ్యాన్ని ధనవంతుల చేతులు శుభ్రం చేసుకోవడానికి వాడడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన విషయం గమనార్హం.



