కరీంనగర్లో మరోమారు కోవిడ్ పడగ..
కరీంనగర్ మరోమారు ఉలిక్కిపడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్-19 రక్కసి చాపకింద నీరులా విస్తరిస్తోంది...

దేశవ్యాప్తంగా మర్కజ్ మతప్రార్థనల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ మరోమారు ఉలిక్కిపడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్-19 రక్కసి చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మరోమారు తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. నగరంలో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో) సుజాత ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ముగ్గురు ఉండగా.. ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా తిరిగిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా తెలిపారు. వీరందరినీ హైదరాబాద్ తరలించినట్లు వెల్లడించారు.
కరీంనగర్లో ఇప్పటి వరకు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో 10 మంది ఇండోనేసియా వాసులే కావడం గమనార్హం. ఇండోనేసియా బృందంలోని వారందరూ కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వీరి కారణంగా స్థానికంగా మరికొంత మందికి కరోనా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాన్ని దిగ్బంధం చేసి 100 వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహించారు. అనుమానితులందరినీ క్వారంటైన్కు తరలించారు. ఎప్పటికప్పుడు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు.
ఈ క్రమంలోనే కరీంనగర్ నుంచి నిజాముద్దీన్లోని మత ప్రార్థనలకు మొత్తం 19 మంది వెళ్లొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వారిలో 11 మందికి కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. మరి కొందరి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు. కరోనా సోకిన బాధితులను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆసుపత్రులకు తరలించినట్లు డీఎంహెచ్వో సుజాత తెలిపారు.