తెరుచుకున్న సర్కార్ బడి…మాస్క్లతో విద్యార్థులు
స్వామి వివేకానంద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పున: ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థులంతా క్లాసులకు రావాలని తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు...
కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారింది. కంటికి కనిపించని ఈ శత్రువుతో అన్ని దేశాలు లాక్డౌన్ యుద్ధం ప్రకటించాయి. భారత్ సహా అమెరికా లాంటి దేశాలు కూడా కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గంగా భావిస్తున్నాయి. కాగా, లాక్డౌన్ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్డౌన్ ఆంక్షలు సడలించవద్దని సూచించింది. ఇదిలా ఉంటే, భారత ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలోనే స్కూలు తిరిగి తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ఈ అంశం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉండగా, గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ముంబయి తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోనే పెద్ద సంఖ్యలో వైరస్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే గుజరాత్లో 4,721 మందికి కరోనా సోకగా.. 236 మంది మరణించారు. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇటువంటి తరుణంలో రాజ్కోట్లోని స్వామి వివేకానంద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పున: ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థులంతా క్లాసులకు రావాలని తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. దీంతో అంతా అయోమయంలో పడిపోయారు. . విద్యార్థులంతా మాస్కులు ధరించి క్లాసులకు హాజరయ్యారు. ఇప్పటికే అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న తరుణంలో విద్యార్థులను పాఠశాలలకు భయం భయంగానే పంపారు. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.