పోలీస్ శాఖలో కరోనా కలకలం..హైదరాబాద్లో10కి చేరిన పాజిటివ్ కేసులు…ఒకరు మృతి
లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోలీస్ శాఖలోనూ కరోనా ఎఫెక్ట్ పడింది. పోలీస్శాఖలో కరోనా కలకలం రేపుతోంది.
కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. తెలంగాణలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగుతూనే ఉంది. సామాన్యుల నుంచి కరోనా రక్షణ కవచాలుగా పనిచేస్తున్న వారిని కూడా కోవిడ్ భూతం వెంటాడుతోంది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోలీస్ శాఖలోనూ కరోనా ఎఫెక్ట్ పడింది. పోలీస్శాఖలో కరోనా కలకలం రేపుతోంది.
హైదరాబాద్ పోలీస్ శాఖలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే తొమ్మిది మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ కాగా ఓ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి తెలిసిందే.. తాజాగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. పది రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో బాధిత కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. ఆయనతో పనిచేసిన వారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. తోటి సిబ్బందిని హోమ్ క్వారంటైన్కు తరలించారు.
ఇదిలావుంటే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్లో ఉంటున్న కూచిపూడి గ్రామానికి చెందిన సీఐ అస్వస్థతకు గురికావడంతో స్థానిక గ్రామస్తులు ఇద్దరు ఆయనను కలిసి పరామర్శించి వెళ్లారు. తాజాగా సీఐకి పాజిటివ్ రావడంతో ఆయన్ను కలిసిన ఇద్దరితో పాటు వారు కలిసిన మరో 25 మంది గ్రామస్థులను వైద్య సిబ్బంది హోం క్వారంటైన్లో ఉంచారు.