TSPSC Group 2 exam: షెడ్యూల్ ప్రకారమే టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష.. పోస్టుల పెంపుపై సర్కార్ అనాసక్తి!
తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 2 పరీక్ష ఏడాదిగా వాయిదా పడుతూనే వచ్చింది. తాజాగా మరోమారు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. అయితే గ్రూప్ 2లో ఒక్క పోస్టు కూడా పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నట్లు ఆనవాలులేవు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి కూడా స్పష్టత..

హైదరాబాద్, జులై 10: తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 2 పరీక్ష ఏడాదిగా వాయిదా పడుతూనే వచ్చింది. తాజాగా మరోమారు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. అయితే గ్రూప్ 2లో ఒక్క పోస్టు కూడా పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నట్లు ఆనవాలులేవు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. అభ్యర్ధులు కోరుతున్నట్టు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన లేదని తేలిపోయింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. ఆ మేరకు జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్ 2 పోస్టులను 2000లకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత చేసిన హామీలు రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
కాగా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్ 2 వాయిదా పడింది. ఈ సారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్ పరీక్ష వాయిదా వేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్లో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును పెంపొందిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అన్ని కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దానిని జులై 31వ తేదీ వరకు తుది గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి నిధిమీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు.