TS ICET 2024: మార్చి 5న టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఐసెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి..
![TS ICET 2024: మార్చి 5న టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/ts-icet-2024.jpg?w=1280)
హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఐసెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించింది. రూ. 250 ఆలస్య రుసుంతో మే 17 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. జూన్ 4, 5 తేదీల్లో ఆన్లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
మార్చి 4వ తేదీన తెలంగాణ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్
రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న తెలంగాణలో ఎడ్సెట్ 2024కు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నట్లు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టీ మృణాళిని వెల్లడించారు. అనంతరం మార్చి 6వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా మే 6వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపడుతారు. ఆలస్య రుసుంతో మే 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్సెట్ పరీక్ష మే 23వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎడ్సెట్కు సంబంధించిన అప్డేట్స్ కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ను చెక్ చేసుకుంటూ ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎడ్ సెట్ ఫలితాల్లో 26,994 అభ్యర్థులు అంటే 98.18 శాతం మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఎడ్ సెట్ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరపున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించింది. రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో రెండు సంవత్సరాల B.Ed కోర్సులో ప్రవేశాల కోసం యేటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.