TGPSC Group 1 Result Date 2025: టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్ధులకు అలర్ట్.. మరో రెండు వారాల్లోనే ఫలితాలు!
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవల మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. మెయిన్స్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన చేస్తుంది. మరో రెండు వారాల్లో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ గ్రూప్1 ఫలితాలను వెల్లడించేందుకు తెలంగాణ పబ్లిక్ కమీషన్ (టీజీపీఎస్సీ) వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిశాఖ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగించి.. అనంతరం మరో రెండు వారాల్లో తుది ఫలితాలను వెల్లడించనుంది. ఈ మేరకు మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం తుది జాబితా వెల్లడిస్తుంది. ఆ తరువాత వెనువెంటనే గ్రూప్ 2, 3 ఫలితాలను కూడా వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది.
కాగా మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా.. అదే ఏడాది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. నిజానికి ప్రిలిమ్స్లో 31,383 మంది క్వాలిఫై అవగా.. వారిలో కేవలం 67.17 శాతం మాత్రమే పరీక్ష రాశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు.
మెయిన్స్ ఫలితాలు వెల్లడించాక.. మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ 1 పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.