AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG TET 2024 Application Postponed: ‘టెట్‌’ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు ప్రక్రియ ఆ మరుసటి రోజు నుంచే అంటే నవంబర్ 5 నుంచి ప్రారంభం కావల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు దరఖాస్తు విధానం వాయిదా పడినట్లు తెలియజేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది..

TG TET 2024 Application Postponed: 'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
TG TET 2024 Application Postponed
Srilakshmi C
|

Updated on: Nov 06, 2024 | 6:56 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 6: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024 నవంబర్) 2024 నోటిఫికేషన్‌ విడుదలై రెండు రోజులవుతున్నా అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా వివరాలు నమోదు కాలేదు. దీంతో టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటనను జారీ చేసింది. సాంకేతిక కారణాలతో వెబ్‌సైట్‌లో వివరణాత్మక నోటిఫికేషన్‌ను అప్‌లోడ్ చేయలేకపోతున్నామని, అందువల్లనే దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడినట్లు పేర్కొంది. వాస్తవానికి, నవంబర్‌ 5వ తేదీనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. తాజా ప్రకటనతో అది గురువారానికి వాయిదా పడింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. నవంబర్‌ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 తేదీల మధ్య ఆయా పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. రేవంత్‌ సర్కార్‌ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏడాదికి రెండో సారి టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం గమనార్హం.

ఈ ఏడాది జరిగిన తొలి టెట్‌ పరీక్షకు దరఖాస్తు ఫీజును రూ.400ల నుంచి రూ.1000కి పెంచారు. దీంతో దరఖాస్తు ఫీజు తగ్గించాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఫీజు తగ్గించలేమని అన్నారు. అయితే ఈ టెట్‌లో అర్హత సాధించని వారు వచ్చేసారి జరిగే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో ప్రకటించారు. గత టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షల మంది పరీక్ష రాయగా.. వారిలో 1.09 లక్షల మంది పాసయ్యారు. అంటే దాదాపు 1.26 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేదన్నమాట. వారంతా ఈసారి టెట్‌కు ఎలాంటి దరఖాస్తు చేసుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా పరీక్ష రాసేవారు మాత్రం రూ.వెయ్యి ఫీజును తగ్గించాలని కోరుతున్నారు. దీనిపై రేవంత్ సర్కార్‌ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి..

తెలంగాణ టెట్‌ 2024 అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా టెట్‌లో మొత్తం రెండు పేపర్లుంటాయి. పేపర్‌ 1కు డీఈడీ, పేపర్‌ 2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌ 1 పరీక్ష, ఉన్నత పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) ఉద్యోగాలకు పేపర్‌ 2 పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, మిగిలిన కేటగిరీలకు 60 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం ఉంటుంది. టెట్‌ పరీక్షలో ఒకసారి పాసైతే ఆ స్కోర్‌కు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. దీంతో మార్కులు పెంచుకునేందుకు అభ్యర్థులు టెట్ నోటిఫికేషణ్‌ వచ్చిన ప్రతిసారి మళ్లీ మళ్లీ పరీక్ష రాస్తుంటారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.